Telangana: 2025 నాటికి క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలిస్తాం: మంత్రి రాజ నర్సింహ
2025 చివరి నాటికి క్షయవ్యాధి (టిబి) నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని డిసెంబర్ 22 శనివారం నాడు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ అన్నారు.
By అంజి Published on 22 Dec 2024 8:40 AM IST
Telangana: 2025 నాటికి క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలిస్తాం: మంత్రి రాజ నర్సింహ
హైదరాబాద్: 2025 చివరి నాటికి క్షయవ్యాధి (టిబి) నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని డిసెంబర్ 22 శనివారం నాడు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ అన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నేతృత్వంలో 'టీబీ ముక్త్ భారత్ అభియాన్' వీడియో కాన్ఫరెన్స్లో రాజనర్సింహ ఈ లక్ష్యాన్ని సాధించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ సిఫార్సు చేసిన అన్ని కార్యక్రమాలను రాష్ట్రం అమలు చేస్తోందని తెలిపారు.
26 మొబైల్ స్క్రీనింగ్ వాహనాలు
డిసెంబర్ 7న, టిబిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం తొమ్మిది జిల్లాల్లో కార్యక్రమాలను ప్రారంభించింది. పరీక్షలను సులభతరం చేయడానికి, టీబీ ప్రమాదం ఉన్న వ్యక్తులను గుర్తించడానికి, అవసరమైన పరీక్షలను నిర్వహించడానికి ఈ జిల్లాల్లో 26 మొబైల్ స్క్రీనింగ్ వాహనాలను మోహరించారు. సమర్థవంతమైన రోగ నిర్ధారణ కోసం ప్రతి వాహనంలో డిజిటల్ ఎక్స్-రే యంత్రాలు, CB-NAAT యంత్రాలు అమర్చబడి ఉంటాయి. టీబీ నిర్మూలన ప్రయత్నాలే లక్ష్యంగా 100-రోజుల కార్యక్రమం కోసం తగినంత టెస్టింగ్ రియాజెంట్లు, ఔషధాలను ప్రభుత్వం సరఫరా చేసింది.
181 మందిని పాజిటివ్గా నిర్ధారించారు
ఇప్పటివరకు జిల్లాల్లో మొత్తం 7,219 మందికి పరీక్షలు నిర్వహించగా, 181 మందికి టిబి పాజిటివ్గా నిర్ధారించారు. టీబీ నిర్మూలనకు ప్రజల్లో అవగాహన పెంచడం, ముందస్తు పరీక్షలు నిర్వహించడం చాలా కీలకమని రాజనర్సింహ హైలైట్ చేశారు. ఈ చొరవలో భాగంగా, రాష్ట్రం నిర్వహించిన పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచింది. 2023లో, 574,000 పరీక్షలు జరిగాయి. ఇది 2024లో 782,000కి పెరుగుతుందని అంచనా వేయబడింది.
తెలంగాణలో టీబీ చికిత్స విజయవంతం రేటు 90%గా ఉంది, ఇది జాతీయ సగటు 87% కంటే ఎక్కువగా ఉందని ఒక పత్రికా ప్రకటన తెలిపింది. తక్కువ టెస్టింగ్ రేట్లు, టిబి రిస్క్ ఎక్కువగా ఉన్న జిల్లాలను లక్ష్యంగా చేసుకుని వచ్చే 100 రోజులలో 'ఇంటెన్సిఫైడ్ టిబి ఎలిమినేషన్ ప్రోగ్రామ్'ను కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమం మార్చి 17, 2025 వరకు అమలులో ఉంటుంది. టీబీ బారిన పడే ప్రమాదం ఉన్న వ్యక్తులను గుర్తించడం, పరీక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది.