నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్

తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

By Srikanth Gundamalla  Published on  14 March 2024 3:00 PM GMT
telangana, government, tet notification,

 నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ 

తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అంతేకాదు.. డీఎస్సీ కంటే ముందే టెట్‌ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు వెంటనే టెట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. మే 20వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు స్కూల్‌ ఎడ్యుకేషన్ కమిషనర్, టెట్ చైర్మన్ వెల్లడించారు. ఈ నెల 27వ తేదీ నుంచి దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా స్వీకరించనున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 10 తేదీ వరకు టెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మెగా డీఎస్సీకి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ కూడా మొదలైంది. మార్చి 4 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ కోటాలో 5 ఏళ్ల పాటు ఏజ్‌ రిలాక్సేషన్‌ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక మొత్తం ఉద్యోగాల్లో 2,629 స్కూల్‌ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 22 స్కూల్ అసిస్టెంట్, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి.

Next Story