హైదరాబాద్: 'ఇందిరమ్మ ఆత్మీయ భరోసా' పెండింగ్ నిధుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. జులై మొదటి వారంలో పెండింగ్ నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. రైతులకు పెట్టుబడి సాయం అందించిన ప్రభుత్వం.. ఇప్పుడు భూమి లేని వ్యవసాయ కూలీలకు ఆర్థిక సాయం చేసే అంశంపై ఫోకస్ పెట్టింది. ఈ పథకం కింద భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏటా రెండు విడతల్లో రూ.12 వేలను ప్రభుత్వం అందిస్తోంది. ఇప్పటికే మొదటి విడతలో 83,887 మందికి రూ.6 వేల చొప్పున జమ చేసింది. మిగిలిన 4,45,304 మందికి రూ.261 కోట్లు విడుదల చేయనుంది.
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగిన ఉండి, కనీసం 20 పని దినాలు పూర్తి చేసిన వారు ఈ పథకానికి అర్హులు. రాష్ట్ర వ్యాప్తంగా 5,19,191 మంది ఈ పథకానికి అర్హులని ప్రభుత్వం ఇప్పటికే తేల్చింది. ఇక ఇటీవల రైతు భరోసా చెల్లింపులను ప్రభుత్వం 9 రోజుల్లోనే పూర్తి చేసింది. ఈ క్రమంలో ఆత్మీయభరోసా పెండింగ్ నిధులు విడుదల చేయాలనే ప్రతిపాదన వచ్చింది. పంచాయతీ ఎన్నికలకు కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ కూలీలకు ఆత్మీయ భరోసా చెల్లిస్తే బాగుంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.