ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా..

By Srikanth Gundamalla  Published on  23 Jun 2023 12:03 PM GMT
Telangana, Government, Employees, Good News

ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా.. ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చే అలవెన్స్‌ను పెంచింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఉద్యోగులకు ట్రావెలింగ్‌ అండ్‌ కన్వీయనియన్స్‌ అలవెన్స్‌ను 30 శాతం పెంచింది. బదిలీపై వెళ్లే ఉద్యోగులకు ట్రాన్స్‌పోర్ట్‌ అలవెన్స్‌ను 30 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. సెలవు రోజుల్లో పని చేసే లిఫ్ట్‌ ఆపరేటర్లు, డ్రైవర్లకు అందనంగా 150 రూపాయలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్‌ ఏరియాలో ఉండే ఉద్యోగులకు స్పెషల్‌ కాంపన్సెటరీ అలవెన్స్ 30 శాతం పెంచింది.

ఇక దివ్యాంగులకు ఇచ్చే కన్వీయన్స్‌ అలవెన్స్‌ రూ.2000 నుంచి రూ.3000కు పెంచింది తెలంగాణ ప్రభుత్వం. ఇళ్లు నిర్మించుకునే వారికి ఇచ్చే అడ్వాన్స్‌ పరిమిని రూ.20 లక్షల ఉంచి రూ.30 లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కారు కొనుగోలు చేసే వారికి ఇచ్చే అడ్వాన్స్‌ పరిమితి కూడా రూ.6లక్షల నుంచి రూ.9లక్షలకు పెంచింది. బైక్‌ కొనాలకునే వారికి ఇచ్చే అడ్వాన్స్‌ను రూ.80వేల నుంచి రూ.లక్షకు పెంచింది. తెలంగాణ ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో ఉద్యోగులు, పెన్షనర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాకుండా ఉద్యోగుల పెళ్లిళ్లకు సంబందించి.. కుమార్తె పెళ్లికి ఇచ్చే అడ్వాన్స్‌ రూ.లక్షను రూ.4లక్షలకు పెంచింది. కుమారుడి పెళ్లికి ఇచ్చే రూ.75వేలను రూ.3లక్షలకు పెంచింది. దీని ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లల పెళ్లిళ్లు చేయడంలో భారం కాస్త తగ్గనుంది. స్టేట్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్స్‌ ఉద్యోగులకు ఇచ్చే ఇన్సెంటివ్‌ 30 శాతం పెంచింది ప్రభుత్వం. గ్రేహౌండ్స్‌, ఇంటెలిజెన్స్, ట్రాఫిక్, సీఐడీ, ఆక్టోపస్, యాంటి నక్సలైట్ స్క్వాడ్‌ విభాగాల్లో పని చేసే పోలీసులకు ఇచ్చే స్పెషల్‌ పేస్‌ను 2020 పే స్కేల్ ప్రకారం వర్తింప చేస్తారని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఫించనర్లు చనిపోతే అందించే తక్షణ సాయం కూడా పెంచింది ప్రభుత్వం. దాన్ని రూ.20వేల నుంచి రూ.30వేలకు పెంచింది. ప్రోటోకాల్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే అన్ని కేటగిరీల్లోని ఉద్యోగులకు అదనంగా 15 శాతం స్కేల్‌ పే మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను మంత్రి హరీష్‌ రావు ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

Next Story