తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలంలో ఐదు గంటల పాటు జరిగిన కేబినేట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగులకురెండు డీఏలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించారు. మెట్రో రెండో విడత విస్తరణ, ములుగు జిల్లా ఇంచర్లలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి 12 ఎకరాలు కేటాయింపు, మహిళా స్వయం సహాయక బృందాల సభ్యుల ప్రమాద బీమా.. లోన్ బీమా చెల్లింపుల కోసం రూ.70 కోట్లు కేటాయింపు, గ్రామీణ రోడ్ల ఆధునీకరణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
కేబినెట్ భేటీ అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగ సంఘాల డిమాండ్లను కేబినెట్లో చర్చించాం. రెండు డీఏలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఒక డీఏ ఇప్పుడు, మరో డీఏ ఆరు నెలల్లో ఇస్తాం. ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు ప్రతినెలా రూ.700 కోట్లు కేటాయిస్తాం. రిటైర్ అయ్యాక పదవీకాలం పొడిగింపు ఇక నుంచి ఉండదు అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.