హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని హెచ్ఐవీ బాధితులకు త్వరలో కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. 13 వేలకుపైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని పరిశీలించి ఆర్థిక శాఖకు పంపుతామని, ఆమోదం లభించగానే పెన్షన్లు మంజూరు చేస్తామన్నారు. కాగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 36 వేల మంది హెచ్ఐవీ బాధితులకు పెన్షన్ లభిస్తోంది. ఇకపై కొత్త వారితో కలుపుకుని 50 వేల మందికిపైగా ఆర్థిక సాయం అందనుంది.
శనివారం నాడు పెండింగ్ పెన్షన్లకు సంబంధించి పేదరిక నిర్మూలన సంస్థ.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్కకు ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రంలో గత రెండేళ్లుగా కొత్తవారికి పెన్షన్ మంజూరు కాలేదని, 13 వేలకుపైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలిపింది. సెర్ప్ ద్వారా ప్రతిపాదనలు తెప్పించుకున్న మంత్రి సీతక్క.. రెండు మూడు రోజుల్లో ఫైల్పై సంతకం చేసిన ఆర్థిక శాఖకు పంపనున్నారు. అక్కడ ఆమోదం లభించిన వెంటనే హెచ్ఐవీ బాధితులకు పెన్షన్లు మంజూరు అవుతాయని అధికార వర్గాలు తెలిపాయి.