తెలంగాణ విద్యా వ్యవస్థలో భారీ మార్పులు..రేవంత్ సర్కార్‌కు విద్యా కమిషన్ కీలక నివేదిక

తెలంగాణ విద్యా కమిషన్ తన కీలక నివేదికను గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించింది.

By -  Knakam Karthik
Published on : 27 Feb 2026 11:36 AM IST

Telangana Education, CM RevanthReddy, Education Commission, Teacher Promotions, No EAPCET, English Medium, Telangana Schools, Education Reform

తెలంగాణ విద్యా వ్యవస్థలో భారీ మార్పులు..రేవంత్ సర్కార్‌కు విద్యా కమిషన్ కీలక నివేదిక

తెలంగాణ విద్యా కమిషన్ తన కీలక నివేదికను గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించింది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పుల కోసం కమిషన్ అనేక సిఫార్సులు చేసింది. ప్రధానంగా, ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రస్తుతం ఉన్న ఆటోమేటిక్ ప్రమోషన్ల విధానాన్ని రద్దు చేసి, పనితీరు ఆధారంగానే పదోన్నతులు కల్పించాలని ప్రతిపాదించింది.

కొత్తగా నియమితులయ్యే ఉపాధ్యాయుల పనితీరును ప్రతి ఐదేళ్లకోసారి సమీక్షించాలని, మెరుగుపడని పక్షంలో వారిని సర్వీసు నుండి తొలగించాలని పేర్కొంది. విద్యా విధానం పూర్తిగా విద్యార్థి కేంద్రంగా ఉండాలని, నర్సరీ నుంచే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని సూచించింది. ఒకటో తరగతి నుండి తెలుగు/ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ భాషలతో త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలని కోరింది.

స్కూల్ బోర్డుల విషయానికి వస్తే, ఎస్ఎస్‌సీ (SSC) మరియు ఇంటర్ బోర్డులను విలీనం చేయాలని, కేవలం 12వ తరగతిలోనే బోర్డు పరీక్షలు నిర్వహించాలని కమిషన్ తెలిపింది. అలాగే ఈఏపీసెట్ (EAPCET) పరీక్షను రద్దు చేసి, ఇంటర్ మార్కుల ఆధారంగానే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ సీట్లు కేటాయించాలని సిఫార్సు చేసింది. డీఎడ్ (D.El.Ed) కోర్సును రద్దు చేసి, నర్సరీ నుండి 5వ తరగతి వరకు బోధించేలా బీఎడ్ (ప్రైమరీ) కోర్సును తీసుకురావాలని సూచించింది.

ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల ఫీజులు, సౌకర్యాలపై నియంత్రణ ఉండాలని, యూనివర్సిటీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేసి రెగ్యులర్ కోర్సులుగా మార్చాలని కమిషన్ స్పష్టం చేసింది. లింగ్డో కమిటీ నివేదిక ప్రకారం విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని, ప్రతి డిగ్రీ కళాశాల పరిధిలో పేద విద్యార్థుల కోసం వసతి గృహాలు ఏర్పాటు చేయాలని నివేదికలో పేర్కొంది.

Next Story