గృహ నిర్బంధంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు

Telangana Congress leaders under house arrest.కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వ‌శ‌ర్మ అనుచిత

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Feb 2022 6:00 AM GMT
గృహ నిర్బంధంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు

కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వ‌శ‌ర్మ అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేత‌లు రాష్ట్రంలోని ప‌లు పోలీస్ స్టేష‌న్ల‌లో ఫిర్యాదు చేశారు. అయితే.. ఏ స్టేష‌న్‌లో కూడా కేసు న‌మోదు చేయ‌క‌పోవ‌డాన్ని నిర‌సిస్తూ.. నేడు అన్ని జిల్లాల ఎస్పీ, క‌మిష‌న‌రేట్ కార్యాల‌యాలను ముట్ట‌డించేందుకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల‌ను ముంద‌స్తు అరెస్ట్ చేస్తున్నారు. టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లను హౌజ్ అరెస్ట్ చేశారు.

కేసీఆర్ మార్చాల‌నుకుంటున్న రాజ్యాంగానికి అక్ర‌మ అరెస్టులే ప్ర‌తీక అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవ‌న్‌రెడ్డి అన్నారు. ప్ర‌జాస్వామ్యంలో ప్రతి భారత పౌరుడికి తన అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు ఉందన్నారు. అయితే.. అసోం ముఖ్యమంత్రి సమాజంలో అశాంతి రేగే విధంగా.. భారత సంస్కృతిని కించపరిచే విధంగా మాట్లాడారన్నారు. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ కూడా ఖండించారని తెలిపారు. కేసీఆర్ అసోం ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఖండించినంత మాత్రాన కాంగ్రెస్కు మద్దతిచ్చినట్లు కాదని జీవ‌న్‌రెడ్డి పేర్కొన్నారు. తాము అసోం ముఖ్యమంత్రిపై వివిధ పోలీస్ స్టేషన్ల‌లో చేసిన ఫిర్యాదు పై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

అసోం ముఖ్య‌మంత్రి వ్యాఖ్య‌ల ప‌ట్ల మ‌హిళ‌ల్లో వెలువెత్తిన ఆగ్ర‌హాన్ని సొమ్ము చేసుకుని వారి సానుభూతి పొందేందుకే కేసీఆర్ తెలివిగా మాట్లాడార‌న్నారు. నిజంగా కేసీఆర్‌కు చిత్త‌శుద్ది ఉంటే.. తాము వివిధ స్టేష‌న్ల‌లో ఇచ్చిన ఫిర్యాదుపై కేసులు న‌మోదు చేయాల‌న్నారు. ప్రధాన మంత్రి మోదీ అస్సాం ముఖ్యమంత్రి ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

Next Story