Telangana: పౌరసరఫరాల శాఖ సంచలన నిర్ణయం.. వారి రేషన్‌ కార్డులు రద్దు

రేషన్‌ కార్డుల విషయమై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 78,842 రేషన్‌ కార్డులను రద్దు చేయాలని నిర్ణయించింది.

By అంజి
Published on : 23 Jun 2025 9:38 AM IST

Telangana, Civil Supplies Department, ration cards

Telangana: పౌరసరఫరాల శాఖ సంచలన నిర్ణయం.. వారి రేషన్‌ కార్డులు రద్దు

హైదరాబాద్‌: రేషన్‌ కార్డుల విషయమై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 78,842 రేషన్‌ కార్డులను రద్దు చేయాలని నిర్ణయించింది. రేషన్‌షాపుల్లో ఉచితంగా బియ్యం ఇస్తున్నా.. కొంతమంది తీసుకోవడం లేదు. కనీసం 6 నెలలుగా రేషన్‌ తీసుకోని వారి లిస్ట్‌ను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే రాష్ట్రానికి పంపింది. ఈ క్రమంలోనే పౌరసరఫరాల శాఖ దాన్ని జిల్లాల కలెక్టర్లకు పంపించి క్షేత్రస్థాయిలో విచారణ చేయించింది. ఈ విచారణలో 78,842 రేషన్‌ కార్డులను అనర్హమైనవిగా తేల్చారు.

కొందరు లబ్ధిదారులు మరణించినా, వివరాలు అప్డేట్ కాలేదు. మరికొంది ఆధార్ వివరాలు తప్పుగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. మరికొందరు ఈ-కేవైసీ పూర్తి చేయలేదు. త్వరలోనే అనర్హుల రేషన్‌కార్డులు తొలగిపోనున్నాయి. రద్దయ్యే రేషన్‌ కార్డుదారులు ఎక్కువగా హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మేడ్చల్‌ జిల్లాల్లో ఉన్నారని కేంద్ర ప్రభుత్వం పంపిన జాబితా ఆధారంగా తెలిసింది. కాగా రేషన్ కార్డు లబ్ధిదారుల పారదర్శకతలో భాగంగా కేంద్రం ప్రభుత్వం ఏడాది క్రితమే ఈ-కేవైసీ ప్రక్రియను ప్రారంభించింది.

రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్క కుటుంబసభ్యులు సమీప రేషన్ దుకాణానికి వెళ్లి వేలి ముద్రలు ఇచ్చి ఈ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పుడే లబ్ధిదారుల లెక్క అధికారికంగా ధ్రువీకరించినట్లు అవుతుంది. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 2 లక్షల రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల 91.83 లక్షలకు చేరింది. మొత్తం లబ్ధిదారుల సంఖ్య 2.93 కోట్ల నుంచి 3.10 కోట్లకు పెరిగింది.

Next Story