తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేత..! జ‌న‌స‌మ్మ‌ర్దంపై ఆంక్ష‌లు..?

Telangana Cabinet to meet today.తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా క‌ట్ట‌డికి అమ‌లు చేస్తున్న‌లాక్‌డౌన్ గ‌డువు నేటితో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Jun 2021 2:37 AM GMT
తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేత..! జ‌న‌స‌మ్మ‌ర్దంపై ఆంక్ష‌లు..?

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా క‌ట్ట‌డికి అమ‌లు చేస్తున్న‌లాక్‌డౌన్ గ‌డువు నేటితో ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న శ‌నివారం మంత్రివ‌ర్గం అత్య‌వ‌స‌రంగా స‌మావేశం కానుంది. మ‌ధ్యాహ్నాం 2 గంట‌ల‌కు ఈ స‌మావేశం ప్రారంభంకానుంద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి. మంత్రివ‌ర్గ స‌మావేశంలో లాక్ డౌన్ కొనసాగించాలా? వద్దా? అన్న అంశంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాకుండా వానాకాలం సాగు, వ్యవసాయ సంబంధిత సీజనల్‌ అంశాలు, గోదావరి నుంచి నీటిని ఎత్తిపోత, జలవిద్యుత్‌ ఉత్పత్తి తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.

ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఎత్తివేయాల‌ని ప్ర‌భుత్వం బావిస్తోంది. జ‌న‌స‌మ్మ‌ర్థం ర‌ద్దీపై ఆంక్ష‌లు కొన‌సాగించేందుకు యోచిస్తోంది. థియేట‌ర్లు, ప‌బ్బులు, క్ల‌బ్బులు, బార్లు వంటి వాటి మూసివేత కొన‌సాగ‌నుంది. వివాహాలు, అంత్య‌క్రియ‌ల‌కు పాత నిబంధ‌న‌లు అమ‌లు చేయ‌నుంది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, పాజిటివిటీ రేటు 1.36శాతంగా నమోదు కావడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, లాక్‌డౌన్‌ను ఎత్తివేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక థ‌ర్డ్ వేవ్ గురించి ఉన్న భ‌యాందోళ‌న‌ల‌పైనా వైద్య ఆరోగ్యశాఖ నుంచి సీఎం స్ప‌ష్ట‌త కోరారు. మాస్క్‌ను ధ‌రించ‌డం, క‌రోనా నిబంధ‌న‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేయాల‌నే ఆలోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది సాధారణ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ చెప్తున్న నేపథ్యంలో పంటల సాగుపై మంత్రివర్గం పలు అంశాలను చర్చించనున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసి వివిధ రిజర్వాయర్లను నింపడం, అక్కడి నుంచి చెరువులు, కుంటలను నింపడంపైనా చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కూడా చర్చించే అవకాశం ఉన్నది. రైతులకు రైతుబంధు డబ్బులు చేతికొస్తుండటంతో ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచటం, నాణ్యమైన విత్తనాలను అందించడంపై దృష్టి పెట్టనున్నది. ప్రత్యామ్నాయ పంటల సాగుతోపాటు తెలంగాణకు హరితహారం కార్యక్రమం కింద మొక్కలు నాటడంపైనా చర్చించే అవకాశం ఉన్నది.

Next Story