నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశం, సభకు 51 మంది కొత్త ఎమ్మెల్యేలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశం ఇవాళ సమావేశం కాబోతుంది. శనివారం ఉదయం 11 గంటల అసెంబ్లీ సమావేశం అవ్వనుంది.

By Srikanth Gundamalla  Published on  9 Dec 2023 1:15 AM GMT
telangana, assembly,  mla, governor,

నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశం, సభకు 51 మంది కొత్త ఎమ్మెల్యేలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశం ఇవాళ సమావేశం కాబోతుంది. శనివారం ఉదయం 11 గంటల అసెంబ్లీ సమావేశం అవ్వనుంది. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ఆదేశాల మేరకు శాసనసభ కార్యదర్శి శుక్రవారమే గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. సభలో సీనియర్ ఎమ్మెల్యే అయిన అక్బరుద్దీన్ ఒవైసీతో ఉదయం 8.30 గంటలకు ప్రొటెం స్పీకర్‌గా రాజ్‌భవన్‌లో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయిస్తారు. 11 గంటలకు అసెంబ్లీ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ప్రొటెం స్పీకర్‌ అసెంబ్లీ నియమావళి ప్రకారం ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు.

మూడో శాసన సభ తొలి సమావేశం సందర్భంగా అసెంబ్లీకి రంగులు వేసి సుందరంగా తీర్చిదిద్దారు. ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారోత్సవానికి వారివారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేశారు అధికారులు. స్పీకర్, ముఖ్యమంత్రి చాంబర్లను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. మరోవైపు అసెంబ్లీ సమావేశం నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఆంక్షలు ఉండనున్నాయి. సభ జరుగుతున్న సమయంలో శాసనసభ ప్రాంగణం, వెలుపల ప్రశాంత వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు ఉన్నతాధికారులు పలు సూచనలు చేశారు.

ఈసారి అసెంబ్లీలోకి 51 మంది కొత్తవారు అడుగుపెడుతున్నారు. వీరిలో ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అధికంగా అయితే ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి ఏకంగా 8 మంది కొత్తవారు ఎన్నిక అయ్యారు. కొత్తగా అసెంబ్లీలో అడుగుపెడుతున్న 18 మంది ఎమ్మెల్యేలకు ఇదివరకు ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. వీరందరూ తొలిసారి పోటీ చేసిన గెలిచినవారే కావడం గమనర్హం. ఈ నేపథ్యంలో అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేలందరికీ లేఖలు అందాయి. కొత్త సభ్యులు శాసనసభకు ఏఏ పత్రాలు తీసుకురావాలనేదానిపై క్లారిటీగా చెప్పారు. ప్రతి శాసనసభ సభ్యుడు ఎన్నికల్లో గెలిచాక రిటర్నింగ్ అధికారి జారీ చేసిన ధృవీకరణ పత్రంతో పాటు రెండు జీరాక్స్ కాపీలను శాసనసభ సచివాల అధికారికి సమర్పించాలన్నారు. ఒరిజినల్‌ పత్రాన్నిఇ మాత్రం పరిశీలన అనంతరం తిరిగి ఎమ్మెల్యేకే అందజేస్తారు.

Next Story