విషాదం.. ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయుడు మృతి

Teacher died on election duty.వ‌రంగ‌ల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎన్నిక‌ల విధుల‌కు హాజ‌రైన ఓ ఉపాధ్యాయుడు గుండెపోటుతో మృతి చెందారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 April 2021 7:03 AM GMT
Teacher died in election duty

వ‌రంగ‌ల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎన్నిక‌ల విధుల‌కు హాజ‌రైన ఓ ఉపాధ్యాయుడు గుండెపోటుతో మృతి చెందారు. వివ‌రాల్లోకి వెళితే.. జ‌న‌గామ జిల్లా చిల్పూర్ మండ‌లంలోని కొండాపూర్ ప్రాథ‌మిక పాఠ‌శాల‌లో మెతుకు ర‌మేష్ బాబు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. కాగా.. ఎన్నిక‌ల విధుల్లో భాగంగా గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మున్సిపాలిటీ 57వ డివిజ‌న్‌లోని స‌మ్మ‌య్య న‌గ‌ర్‌లో పోలింగ్ బూత్ కేటాయించారు. శుక్ర‌వారం ఉద‌యం పోలింగ్ బూత్‌లో విధులు నిర్వ‌ర్తిస్తుండ‌గా.. ఛాతిలో నొప్పిరావ‌డంతో ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయాడు. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన తోటి సిబ్బంది ఆయ‌న్ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప‌రీక్షించిన వైద్యులు అప్ప‌టికే ఆ ఉపాధ్యాయుడు మృతి చెందిన‌ట్లు డాక్ట‌ర్లు తెలిపారు.

గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌లో మొత్తం 66 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 500 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. ఇక్కడ 6,53,240 మంది ఓటర్లు ఉన్నారు. వీరికోసం 878 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల వరకు వరంగల్‌లో 23.62 శాతం పోలింగ్‌ నమోదయింది. సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది.


Next Story