ఉపాధ్యాయురాలి కర్క‌శం.. నోట్లో నుంచి ఉమ్ము పడిందని

Teacher Beat Student in Shankarpally.ఓ చిన్నారి క్లాస్‌లోకి వ‌చ్చేందుకు అనుమ‌తి అడుగుతున్న క్ర‌మంగా నోట్లోంచి ఉమ్ము

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Oct 2021 6:49 AM GMT
ఉపాధ్యాయురాలి కర్క‌శం..  నోట్లో నుంచి ఉమ్ము పడిందని

ఓ చిన్నారి క్లాస్‌లోకి వ‌చ్చేందుకు అనుమ‌తి అడుగుతున్న క్ర‌మంగా నోట్లోంచి ఉమ్ము కింద‌ప‌డింది. దీంతో ఉపాధ్యాయురాలి కోపం నషాళానికి అంటింది. ఆగ్ర‌హాంతో ఊగిపోతూ చిన్నారిని విచ‌క్ష‌ణార‌హితంగా చిత‌క‌బాదింది. బాలుడు తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న రంగారెడ్డి జిల్లా శంక‌ర్‌ప‌ల్లి మున్సిపాలిటీ ప‌రిధిలో జ‌రిగింది.

పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. శంక‌ర్‌ప‌ల్లి గ్రామానికి చెందిన సాయిలు, ల‌త దంప‌తుల కుమారుడు సంజీవ్‌కుమార్‌(8) ఫత్తేపూర్‌ ప్రభుత్వ పాఠశాలలో మూడో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. గురువారం త‌ర‌గ‌తి గ‌దిలోకి వెళ్లేందుకు ఉపాధ్యాయురాలు శ్వేత‌ను సంజీవ్‌కుమార్ అనుమ‌తి అడుగుతున్న క్ర‌మంలో అత‌డి నోట్లోంచి ఉమ్ము కింద‌ప‌డింది. దీంతో ఉపాధ్యాయురాలు శ్వేత ఆగ్ర‌హాంతో క‌ర్ర‌తో ఆ బాలుడిని చిత‌క‌బాదింది. దీంతో సంజీవ్‌కుమార్ చేతులు, కాళ్లు, ముఖం పై చ‌ర్మం క‌మిలిపోయింది. సాయంత్రం ఇంటికి వెళ్లిన చిన్నారి ఒంటిపై దెబ్బ‌లు చూసిన త‌ల్లిదండ్రులు ఏం జ‌రిగింద‌ని చిన్నారుల‌కు అడుగ‌గా.. టీచ‌ర్ కొట్టింద‌ని చెప్పడంతో శంక‌ర్ ప‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఇదే విష‌య‌మై టీచ‌ర్‌ను అడుగ‌గా.. చిన్నారికి క్ర‌మ‌శిక్ష‌ణ లేద‌ని అందుకే కొట్టాన‌ని చెబుతోంది. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేపట్టారు.

వేటు..

చిన్నారిని ఇష్టం వ‌చ్చిన‌ట్లు కొట్టిన‌ ఉపాధ్యాయురాలిని జిల్లా విద్యాధికారి సస్పెండ్‌ చేసినట్లు మండల విద్యాధికారి అక్బర్‌ తెలిపారు. విద్యార్థి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపామన్నారు.

Next Story