తాండూర్: పైలట్ రోహిత్ రెడ్డి ముందున్న సవాళ్లు ఏమిటి?

దేనిపై, ఎవరిపై పోరాడాలో తెలియని పరిస్థితి తాండూరు సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌ పైలట్‌ రోహిత్‌రెడ్డిది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Nov 2023 7:00 AM GMT
Tandoor, BRS, Pilot Rohit Reddy, Telangana Polls

తాండూర్: పైలట్ రోహిత్ రెడ్డి ముందున్న సవాళ్లు ఏమిటి? 

తెలంగాణ: దేనిపై ఎవరిపై పోరాడాలో తెలియని పరిస్థితి తాండూరు సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌ పైలట్‌ రోహిత్‌రెడ్డి పరిస్థితి. ఆయన రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

తాండూరులో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోరు అయితే కనిపించడం లేదు. కానీ ఎమ్మెల్యే రోహిత్‌కు సొంత పార్టీలోనే శత్రువులు ఉన్నారనే ప్రచారం సాగుతూ ఉంది. రోహిత్ రెడ్డిపై కాంగ్రెస్ మాజీ జెడ్పీటీసీ చైర్మన్, ప్రస్తుత డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన ఒక పారిశ్రామికవేత్త. కాంగ్రెస్ జాబితా ప్రకటించే వరకు బీఆర్‌ఎస్‌తో ఉన్న మనోహర్‌రెడ్డి డీసీసీబీ పదవికి మాత్రం ఇంకా రాజీనామా చేయలేదు.

చాలా మందికి సుపరిచితమైన బుయ్యని కుటుంబం వికారాబాద్‌ పక్కనే ఉన్న అసెంబ్లీ నియోజకవర్గమైన పరిగికి చెందినది. ఆ కుటుంబానికి రైస్ మిల్లులు, ఎరువుల పరిశ్రమలు ఉన్నాయి. మనోహర్‌రెడ్డి సోదరుడు బుయ్యని శ్రీనివాస్‌రెడ్డికి మద్యం ఫ్యాక్టరీ ఉంది, పాలేరు కాంగ్రెస్‌ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి వ్యాపార భాగస్వామి. ఆ కుటుంబానికి కాంగ్రెస్‌తో బలమైన అనుబంధం ఉంది. తాండూరు సీటు కోసం పలువురు అభ్యర్థులు ముందుకొచ్చినా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాత్రం మనోహర్‌రెడ్డినే ఎంపిక చేశారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులు ఇద్దరూ జిల్లాలో స్థానికులే. జనసేన పొత్తులో భాగంగా బీజేపీ నేమూరి శంకర్‌గౌడ్‌ను రంగంలోకి దింపింది. ఆయన పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని అంటున్నారు.

తెలంగాణలోని నైరుతిలో ఉన్న తాండూరు.. మహారాష్ట్ర, కర్ణాటకలతో సరిహద్దును పంచుకుంటుంది. మూడు రాష్ట్రాల చిన్న వ్యాపారవేత్తలకు ఓ వాణిజ్య కేంద్రం. రాళ్లు, పసుపు, పప్పుకు పేరుగాంచిన ఈ ప్రాంతంలో అనేక సమస్యలు కూడా ఉన్నాయి.

పట్నం మహేందర్ రెడ్డి Vs రోహిత్ రెడ్డి

బీఆర్‌ఎస్ ప్రభుత్వ జెండా మోసి, రాష్ట్రం ఎన్నికలకు వెళ్లడానికి నెల రోజుల ముందు పట్నం మహేందర్ రెడ్డికి మరోసారి మంత్రి పదవి దక్కింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తన పోర్ట్‌ఫోలియోను తన వద్దే ఉంచుకుంటానని హామీ ఇచ్చారు. 2023లో తాండూరు టికెట్‌ ఇవ్వకపోతే మహేందర్‌రెడ్డి ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని నిఘావర్గాల నుండి సమాచారం అందడంతో బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు మంత్రి పదవిని ఇచ్చి పట్నంను కూల్ చేశారని చెప్పుకుంటూ ఉన్నారు. పైలట్ రోహిత్, మహేందర్ రెడ్డి మధ్య పోటీ ఎన్నో ఏళ్లుగా ఉందని జిల్లా మొత్తానికి తెలుసు.

"మంత్రి మహేందర్ రెడ్డి అనుచరులు రాత్రికి రాత్రే కాంగ్రెస్‌లో చేరడం చూశాం.. దీంతో తాండూరులో బీఆర్‌ఎస్‌ క్యాడర్‌ కాస్తా సన్నగిల్లుతోంది.. సాయంత్రం రోహిత్‌తో కలిసి ర్యాలీగా వెళ్లిన వారు.. ఆ తర్వాత రోజు కాంగ్రెస్‌ అభ్యర్థితో భుజాలు తడుముకోవడం చూశాం. మనోహర్ రెడ్డి.. రోహిత్ మధ్య అంతా బాగానే ఉందని పైకి అనుకుంటూ ఉన్నా.. అంతర్గతంగా వారిద్దరి మధ్య వార్ నడుస్తోంది. తన కొడుకు రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని మహేందర్ రెడ్డి భావిస్తుండగా.. 2018లో అతడిని ఓడించాడు రోహిత్ రెడ్డి" అని ఓ అజ్ఞాత వ్యక్తి తెలిపాడు.

పరిగి, తాండూరు, కొడంగల్ అసెంబ్లీ స్థానాల్లోని కాంగ్రెస్ అభ్యర్థులు పట్నం మహేందర్ రెడ్డి సన్నిహితులేనని న్యూస్‌మీటర్‌ తెలుసుకుంది. అయితే కొడంగల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డిపై ఆయన సోదరుడు, బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. కొడంగల్‌లో రేవంత్‌రెడ్డిని కార్నర్ చేసేందుకు.. బీఆర్‌ఎస్‌ కొడంగల్‌లో బీసీ ఓటర్లను దగ్గర చేసుకోడానికి ప్రయత్నిస్తోంది. రేవంత్‌రెడ్డిని ఓడించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రయత్నిస్తూ ఉన్నారు.. మహేందర్‌రెడ్డి ఆ టీమ్‌కి నాయకత్వం వహిస్తున్నారు.

అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తాండూరు

కరీంనగర్, ఖమ్మం జిల్లాలను కలిపే రాష్ట్ర రహదారుల మాదిరిగా కాకుండా, కొడంగల్ నుండి తాండూరు వరకు ప్రధాన రహదారి గుంతలతో నిండి ఉంది. 100 మీటర్లకు ఓ గుంత అన్నట్లుగా తయారైంది రోడ్డు. తరచుగా ఆయా ప్రాంతాలలో తిరిగే ప్రజలకు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తుంది.

తాండూరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లే వంతెన పురాతనమైనది. పెరుగుతున్న ట్రాఫిక్ కారణంగా బ్రిడ్జి ఆ భారాన్ని భరించలేకపోతోంది. తాండూరులోని అనేక అంతర్గత గ్రామాలు సిమెంట్, మైనింగ్, లేటరైట్ పరిశ్రమల కారణంగా నీరు, వాయు కాలుష్యానికి గురవుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు అత్యంత నిర్లక్ష్యానికి గురవుతున్నాయి.

తాండూరు అభివృద్ధికి నోచుకోలేదని చెప్పడం సరికాదని పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. '2018లో కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచాను.. 2019లో పార్టీ లోపల, బయట ఉన్న సమస్యలను పరిష్కరించడానికి సమయం తీసుకున్నాను. 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరారు. చివరిగా కదిలింది నేనే.. ఒక ఎమ్మెల్యే తన ప్రాంతంలో ప్రాజెక్టులను పూర్తీ చేసుకోవాలంటే యంత్రాంగం మద్దతు కావాలి, ప్రతిపక్షంలో ఉంటే ఎవ్వరూ పట్టించుకోరు.. కనీసం ఫోన్లు కూడా ఎత్తరు. తాండూరు అభివృద్ధి కోసం నేను బీఆర్‌ఎస్‌లో చేరాల్సి వచ్చింది. ఆ తర్వాత రెండేళ్ల పాటూ కోవిడ్‌ మహమ్మారి ప్రజలను ఇబ్బంది పెట్టింది.. 2022లో మాత్రమే ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. నేడు తాండూరు ఆసుపత్రి వైద్య సేవలకు ఉత్తమమైనదిగా పరిగణిస్తూ ఉన్నారు. అనేక హైవే ప్రాజెక్టుల కోసం ప్రయత్నించాను. BRS ప్రభుత్వం ద్వారా రూ.1680 కోట్లకు పైగా నిధులు వచ్చాయి. నేను చేసిన పనులను వివరిస్తూ ఒక పుస్తకాన్ని తయారు చేశాను. నిరుద్యోగ సమస్యలకు సంబంధించి, మనం ముందుగా మౌలిక సదుపాయాలపై సృష్టించాలి. పరిశ్రమలు స్థాపిస్తే తప్ప ఉపాధి కల్పన సాధ్యం కాదు' అని పైలట్ రోహిత్ రెడ్డి న్యూస్‌మీటర్‌ కు వివరించారు.

తాండూరు అసెంబ్లీ స్థానంలో దాదాపు 2.5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 70,000 మందికి పైగా మైనార్టీలు నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలో ముదిరాజ్ కమ్యూనిటీకి చెందిన ప్రజలు అధికంగా ఉంటారు. వికారాబాద్ జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి- పరిగి, తాండూరు, వికారాబాద్ (రిజర్వ్డ్), కొడంగల్. నాలుగు అసెంబ్లీ స్థానాల్లో మూడింటిలో, వెనుకబడిన కులాల జనాభా అధికంగా ఉన్న జిల్లాలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ పార్టీలు రెడ్డి Vs రెడ్డి అభ్యర్థిని ఎంపిక చేశాయి.

కొడంగల్‌లో టీపీసీసీ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ, ఏ రేవంత్ రెడ్డి వర్సెస్ పట్నం నరేందర్ రెడ్డి (ప్రస్తుత బీఆర్‌ఎస్‌ సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు) పోటీ పడుతున్నారు. తాండూరులో బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వర్సెస్ మొదటి సారి పోటీ చేస్తున్న బుయ్యని మనోహర్ రెడ్డి మధ్య పోటీ ఉంది. పరిగిలో కూపుల మహేష్ రెడ్డి వర్సెస్ టీ రామ్మోహన్ రెడ్డి మధ్య పోటీ నెలకొంది. మరీ విజయం ఎవరిని వరించేనో?

Next Story