తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. హత్య కేసును తిరిగి విచారణ జరపాలని సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా పెద్దపల్లి జిల్లా మంథనిలో 2021 ఫిబ్రవరి నెలలో హైకోర్టు లాయర్లైన వామనరావు, ఆయన సతీమణి నాగమణి దంపతులను రోడ్డుపైనే కొందరు దారుణంగా హతమార్చారు. ఈ జంట హత్య తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేయగా.. ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని వామనరావు తండ్రి కిషన్ రావు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ఎంఎం సుందరేశ్ , జస్టిస్ ఎన్ కె. సింగ్ల ధర్మాసనం పిటిషన్ను విచారించి.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
ఈ క్రమంలో.. హత్య కేసును తిరిగి విచారణ జరపాలని, పిటిషనర్కు భద్రత కల్పించాలని సీబీఐకి సూచించింది. అలాగే హత్యకు సంబంధించిన వీడియోలు, పత్రాలు అందజేయాలని ఆదేశించింది. సీబీఐ విచారణ అవసరమా? అనే అంశంపై రికార్డులు పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది. ఈలోపు.. కేసును సీబీఐకి అప్పగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది తెలిపారు. దీంతో.. సీబీఐకి కేసును బదిలీ చేస్తున్నట్లు సుప్రీం కోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది.