సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల పిటిషన్ డిస్మిస్
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో -9ను జారీ చేసిన విషయం తెలిసిందే.
By - అంజి |
సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల పిటిషన్ డిస్మిస్
హైదరాబాద్: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో -9ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం 42 శాతానికి పెంచడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. తాజాగా ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. పిటిషన్ను తిరస్కరించింది. హైకోర్టులో విచారణలో ఉండగా సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారని పిటిషనర్ గోపాల్రెడ్డిని ప్రశ్నించింది.
అయితే హైకోర్టులో స్టే ఇవ్వకపోవడంతో ఇక్కడికి వచ్చామని పిటిషనర్ తెలిపారు. దీంతో హైకోర్టులో పెండింగ్లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం తరఫున లాయర్లు సింఘ్వీ, దవే వాదనలు వినిపించారు. విచారణ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి సుప్రీంకోర్టుకు వెళ్లారు. కాగా ఎల్లుండి హైకోర్టులో విచారణ జరగనుంది.
ఇదిలా ఉంటే.. ప్రభుత్వం ప్రతిపాదించిన బీసీ రిజర్వేషన్లకు మద్ధతుగా హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ నేత వీహెచ్, బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య, మాజీ ఐఏఎస్ చిరంజీవులు వీటిని ఫైల్ చేశారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచచడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ కేసులో తమ వాదనలూ వినాలని కోరుతూ ఇంప్లీడ్ పిటిషన్లు వేశారు. వీటన్నింటినీ హైకోర్టు ఎల్లుండి విచారించనుంది.