అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 మూవీ బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో బాలుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అయితే బాలుడు శ్రీతేజ్ ప్రస్తుతం సిటీలోని కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు పలువురు ప్రముఖులు ఇప్పటికే పరామర్శిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ కిమ్స్కు వెళ్లి బాలుడు శ్రీతేజ్ను పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్యం కుదుటపడటంతో సంతోషం వ్యక్తం చేశారు. శ్రీ తేజ్కు ఇంకా మెరుగైన అందించడానికి విదేశాలకు తీసుకెళ్లాల్సి వస్తే.. దానికి అయ్యే ఖర్చు తాను భరిస్తానని వైద్యులతో చెప్పినట్లు సమాచారం.
కాగా గత సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన గాయపడిన శ్రీతేజ్ రెండు నెలలు కావొస్తున్నా పూర్తిగా కోలుకోలేదు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ్ తల్లి మృతి చెందారు. ఈ ఘటనలో గాయాలైన శ్రీతేజ్కు కిమ్స్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. అయితే తొక్కిసలాటకు సంబంధించిన కేసులో సినీ హీరో అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన బెయిల్పై విడుదల అయ్యారు. ఇలా విడుదలైన బన్నీని పలువురు సినీ ప్రముఖులు పరామర్శించడం విమర్శలకు దారి తీసింది. అయితే శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి వివరాలను నిర్మాత బన్నీ వాసు ద్వారా అల్లు అర్జున్ తెలుసుకుంటున్నారు. లేటెస్ట్గా కిమ్స్లో శ్రీతేజ్ను బన్నీ వాసు పరామర్శించి.. మెరుగైన వైద్యం అందించేందుకు డాక్టర్లతో మాట్లాడినట్లు తెలుస్తోంది.