తెలంగాణలో ఇటీవల జరిగిన రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్సీలు సోమవారం రాష్ట్ర శాసనమండలిలో ప్రమాణస్వీకారం చేశారు. ఎన్నికల్లో బీజేపీ నుంచి మల్కా కొమురయ్య, అంజి రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా.. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, రఘునందన్ రావులు పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా కాంగ్రెస్ నుంచి ఏకగ్రీవం ఎన్నికైన విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యంలతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే నల్గొండ- ఖమ్మం- వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు.