తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయబోతోంది. ఈ స్కీమ్ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ రేపటితో ముగియనుంది. మొత్తం 16.22 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా కమిటీలు పరిశీలన చేపట్టి అర్హుల జాబితాను సిద్ధం చేస్తున్నాయి. రేపు జిల్లాల ఇన్ఛార్జి మంత్రుల ఆమోదంతో కలెక్టర్లు ఫైనల్ లిస్ట్ను ఖరారు చేయనున్నారు. జూన్ 2 నుంచి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్నారు. ఈ ఏడాది 5 లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మూడు నెలల్లో విడతల వారీగా రూ.6 వేల కోట్లు ఖర్చు చేయాలని రేవంత్ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది.
కాగా పథకం నిబంధనల మేరకు.. ఒంటరి మహిళలు, అత్యంత పేదలు, దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అయితే దరఖాస్తుదారులు ఈ పథకం అమలు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. మంజూరు లిస్టులో తమ పేరు ఉందో లేదోనని టెన్షన్ పడుతున్నారు. ఈ స్కీమ్ కింద లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్ మొత్తం వ్యయంలో 60 నుంచి 80 శాతం ప్రభుత్వం రాయితీ అందించనుంది. రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు 60 శాతం రాయితీ, రూ.2 లక్షల వరకు 80 శాతం రాయితీ ఇవ్వనున్నారు. రూ.50 వేల రుణాలకు సంబంధించి చిన్న యూనిట్లకు, చిన్న నీటిపారుదల పథకాలకు అందించే రుణాలకు బ్యాంకు లింక్తో సంబంధం లేకుండా 100 శాతం రాయితీ అందించనున్నారు.