హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు తీవ్రమయ్యాయి. ఎండ వేడిమి కారణంగా ప్రజలు బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేశాయి. నిన్న నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయ. అత్యధికంగా నిజామాబాద్లోని సీహెచ్ కొండూరులో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, వికారాబాద్, నల్గొండ, సంగారెడ్డి జిల్లాల్లో 3 రోజుల పాటు ఈదురుగాలులు, ఉరుములుతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన రెండు రోజుల్లో దాదాపు 8 మంది వడదెబ్బతో మృతి చెందారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు బయటకు రావొద్దని అధికారులు సూచించారు. అత్యవసరం అయితేనే మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలని ప్రజలకు ఐఎండీ అధికారులు సూచించారు.