సీఎం గారూ.. ఆ 1500 మందిని పట్టించుకోండి: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన సుమారు 1500 మంది అభ్యర్థులు ప్రభుత్వ అలసత్వంతో తీరని అన్యాయానికి గురవుతూ మనోవేదన చెందుతున్నారని బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు.

By అంజి  Published on  30 March 2024 7:17 AM GMT
RS Praveen Kumar, CM Revanth, Police Constable jobs, Telangana

సీఎం గారూ.. ఆ 1500 మందిని పట్టించుకోండి: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

తెలంగాణ పోలీస్ నియామక మండలి నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన సుమారు 1500 మంది అభ్యర్థులు ప్రభుత్వ అలసత్వంతో తీరని అన్యాయానికి గురవుతూ మనోవేదన చెందుతున్నారని బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సివిల్, ఏఆర్, ఎస్‌ఏఆర్, టీఎస్‌ఎస్‌పీ విభాగాల్లో కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్ధులు తమ స్వీయ ధృవీకరణ (Self Attestation) పత్రంలో తమపై రకరకాల కారణాలతో నమోదైన సివిల్, క్రిమినల్, బైండోవర్, కరోనా, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘన కేసులు ఉన్నట్లు ధ్రువీకరించారు. వీరిపై నమోదైన కేసుల్లో వారు విద్యార్థి దశలో చేసిన విద్యార్థి ఉద్యమ కేసులు, గ్రామీణ ప్రాంతాల్లో జరిగే కుటుంబ తగాదాలతో కక్షపూరితంగా, ఉద్దేశపూర్వకంగా నమోదైన కేసులే అత్యధికమని ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు.

ఎంపికైన అభ్యర్థులపై నమోదైన చాలా కేసుల్లో ఇప్పటికే కొందరు అభ్యర్థులు కోర్టుల్లో నిర్దోషిగా తేల్చబడ్డారని, స్పెషల్ బ్రాంచ్ అధికారుల తుది పరిశీలనలో కూడా అభ్యర్థులు ఆ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలతోపాటు,కేసుల్లో నిర్దోషిగా తేలిన కోర్టు జడ్జిమెంట్ కాఫీలను స్వయంగా అభ్యర్ధులు స్పెషల్ బ్రాంచ్ అధికారులకు, టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ అధికారులకు అందించినా సదరు అభ్యర్థులకు శిక్షణకు అవకాశం కల్పించడం లేదని, నిరుద్యోగులపై ఇంత చులకనభావం ఎందుకు? అని ప్రభుత్వాన్ని ప్రవీణ్‌ కుమార్‌ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ ఎంతో ఆర్భాటంగా ఫిబ్రవరి 14 న ఎల్‌బీ స్టేడియంలో అందజేసిన ఎంపిక పత్రాల్లో వీరికి మొండి 'చేయి' చూపారు. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం.. బాధ్యతా రహిత్యమే అని అన్నారు. యూపీఎస్సీ నిర్వహించే ఉద్యోగ నియామకాల్లో స్వీయ ధృవీకరణ (Self Attestation) పత్రంలో పేర్కొన్న కేసుల్లో స్పెషల్ బ్రాంచ్ (SB), ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) అధికారుల తుది పరిశీలనలో నిర్దోషిగా తేలితే ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

కానీ ఇక్కడ ప్రభుత్వం మాత్రం విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో వింతగా వ్యవహరిస్తూ ఎంపికైన అభ్యర్థులకు తీరని అన్యాయం చేస్తున్నదని అన్నారు. గత రెండు నెలలుగా కానిస్టేబుల్ గా ఎంపికైన అభ్యర్థులు శిక్షణ కోసం ఆర్డర్ కాపీలు ఇవ్వాలని ముఖ్యమంత్రి నివాసం, డీజీపీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ఎవ్వరూ పట్టించుకోవడంలేదు. దీంతో అభ్యర్థులు,కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. అసలు తెలంగాణలో ప్రభుత్వం ఉన్నదా? అని ప్రవీణ్‌ కుమార్‌ ప్రశ్నించారు. సదరు అభ్యర్థుల మనోవేదనపై రాష్ట్ర ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి స్పెషల్ బ్రాంచ్ (SB) పరిశీలనలో నిర్దోషిగా తేలిన కానిస్టేబుల్ అభ్యర్థులను శిక్షణకు పంపేలా టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ చైర్మన్ కు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్ చేస్తోందని ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు.

Next Story