తెలంగాణలో మాస్క్‌ ధరించకపోతే 1000 జరిమానా.. ఉత్త‌ర్వులు జారీ

RS 1000 fine for not wearing masks in Telangana.తెలంగాణ రాష్ట్రంలో మాస్క్ ధ‌రించ‌ని వారికి రూ.1000 జ‌రిమానాగా విధించాల‌ని సూచించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 April 2021 11:11 AM GMT
fine for not wearing mask

తెలంగాణ రాష్ట్రంలో గ‌త కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. రాష్ట్రంలో క‌రోనా కేసుల తీవ్ర‌త పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో మాస్క్‌ను ధ‌రించ‌డం త‌ప్ప‌ని స‌రి చేసింది. మాస్క్ ధ‌రించ‌ని వారికి రూ.1000 జ‌రిమానాగా విధించాల‌ని సూచించింది. జ‌నం ఎక్కువ‌గా ఉండే ప్రాంతాలు, ప్ర‌జా రావాణా, ఆఫీసుల్లో ఈ నిబంధ‌న‌లు ఖ‌చ్చితంగా అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలంటూ జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులను ఆదేశించారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్-2005, కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది.

కాగా.. గ‌డిచిన 24గంట‌ల్లో రాష్ట్రంలో 1,15,311 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 3,187 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన కేసుల సంఖ్య 3,27,278కి చేరింది. నిన్న ఒక్క రోజే ఏడుగురు క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్రాణాలు కోల్పోగా.. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా వైర‌స్ కార‌ణంగా చ‌నిపోయిన వారి సంఖ్య 1,759కి చేరింది. నిన్న ఒక్క రోజే 787 మంది కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,05,335కి చేరింది. రాష్ట్రంలో ప్ర‌స్తుతం 20,184 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 13,366 మంది హోంఐసోలేష‌న్‌లో ఉన్నారు. ఇక జీహెచ్ఎంసీలో తాజాగా 551 కేసులు, మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరిలో 333, రంగారెడ్డిలో 271 కేసులు న‌మోద‌య్యాయి.




Next Story