బీజేపీ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్ రామచంద్ర రావు పేరును అధిష్టానం ఖరారు చేసింది. అయితే ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇవాళ ఆయన అధ్యక్ష పదవి కోసం నామినేషన్ దాఖలు చేయనున్నారు. తాను నామినేషన్ వేస్తున్నానని.. అధిష్టానం నుండి ఇంకా ఎలాంటి సమాచారం తనకు అందలేదని రామచందర్ రావు మీడియాకు తెలిపారు.
అయితే బీజేపీ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందని నెలకొన్న సందిగ్ధతకు తెరపడినట్లు అయింది. పలువురు సీనియర్ నేతల పేర్లు వినిపించినప్పటికీ అధిష్టానం అనూహ్యంగా రామచందర్ రావును ఎంపిక చేసింది. కాగా రాష్ట్రంలో పార్టీ పగ్గాలను ఎవరికి అప్పగించాలనే అంశంపై బీజేపీ అగ్రనాయకత్వం తీవ్రంగా కసరత్తు చేసింది. ముఖ్యంగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ వంటి నేతల పేర్లు అధ్యక్ష పదవి రేసులో బలంగా వినిపించాయి. అయితే, అన్ని సమీకరణాలను బేరీజు వేసుకున్న అధిష్ఠానం చివరికి రామచందర్రావు వైపే మొగ్గు చూపింది.