జనగామ జిల్లాలో పెద్దపులి సంచారంతో తీవ్ర కలకలం రేపుతోంది. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం కుందారం శివారులో పెద్ద పులి పాదముద్రలను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా అటవీ ప్రాంతం నుండి వచ్చిన పులి.. యాదాద్రి భువనగిరి జిల్లా మీదుగా సంచరిస్తూ జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలోని కుందారం గ్రామంలోకి ప్రవేశించింది. పెద్దపులి సంచారం.. జిల్లా ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.
గురువారం ఉదయం కుందారం సమీపంలో పులి పాదాల గుర్తులను గమనించిన రైతులు డయల్ 100కు ఫోన్ చేయడంతో స్థానిక ఎస్సై శ్రావణ్కుమార్ అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా డీఎఫ్ఓ తన సిబ్బందితో వెళ్లి పాదాల గుర్తులను పరిశీలించి పులి సంచరించినట్లు గుర్తించారు.
కుందారం - బాణాజీపేట మధ్యలో పులి సంచరిస్తున్నట్టు పులి పాదముద్రల ద్వారా అధికారులు గుర్తించారు. ప్రజల అప్రమత్తంగా ఉండాలని, పశువులను ఇంటివద్ద కట్టేసి జాగ్రత్తగా చూసుకోవాలని అధికారులు కోరారు. సోషల్ మీడియాలో ఏఐ క్రియేటివిటీతో అసత్య ప్రచారాలు చేయొద్దని అధికారులు హెచ్చరించారు. పులి కదలికలను కనిపెట్టేందుకు రెండు టీంలతో పాటు రెస్క్యూ టీమ్ ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.