కాంగ్రెస్ గూటికి ఆరెంజ్ ట్రావెల్స్ ఓనర్ సునీల్ రెడ్డి

బాల్కొండ నియోజకవర్గానికి చెందిన ఆరంజ్ ట్రావెల్స్ ఓనర్ ముత్యాల సునీల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.

By అంజి  Published on  28 Jun 2023 11:40 AM GMT
Orange Travels owner Sunil Reddy, Congress , Nizamabad, Balconda

కాంగ్రెస్ గూటికి ఆరెంజ్ ట్రావెల్స్ ఓనర్ సునీల్ రెడ్డి

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో రాజకీయ వేడి రోజురోజుకూ పెరుగుతోంది. టిక్కెట్ల కోసం ఆశావహుల ప్రయత్నాలు సైతం ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరికలు మొదలయ్యాయి. తాజాగా బాల్కొండ నియోజకవర్గానికి చెందిన ఆరంజ్ ట్రావెల్స్ ఓనర్ ముత్యాల సునీల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. సోమవారం ఢిల్లీలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డిని సునీల్ కలిశారు. ఈ సమావేశంలోనే సునీల్‌రెడ్డి చేరిక ఖరారైందని సమాచారం.

రేవంత్‌ని కలిసిన తర్వాత.. ఆ పార్టీ వ్యూహకర్త సునీల్‌ కనుగోలుతో సునీల్‌ సమావేశమయ్యారు. మరో వారం రోజుల్లో సునీల్‌ రెడ్డి పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఇందుకు ప్రొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి సైతం పచ్చ జెండా ఊపినట్లు సమాచారం. సునీల్‌ రెడ్డికి టిక్కెట్‌ ఇచ్చేందుకు పీసీసీ వర్గాలు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో సునీల్‌రెడ్డికి బీఎస్పీ నుంచి పోటీ చేశారు. అప్పుడు ఆయనకు 40 వేల పైగా ఓట్లు వచ్చాయి. అయితే బాల్కొండ నుంచి డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి కూడా టిక్కెట్టును ఆశిస్తున్నారు.

అయితే సునీల్‌ రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీలో జాయిన్‌ చేసుకోవడానికి వీల్లేదంటూ పీసీసీకి జిల్లా కాంగ్రెస్‌ నేతలు తేల్చి చెప్పారు. నిన్న మొన్నటి వరకు బీజేపీలో చేరుదామనుకుని, ఆ పార్టీ నేతల వెంబడి తిరిగిన సునీల్‌ రెడ్డి.. కాంగ్రెస్‌ బలం పుంజుకోవడంతో పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. సునీల్‌ది అవకాశవాద రాజకీయం అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం ఉంటుందని జిల్లా కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు అంటున్నారు.

Next Story