ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత 40 ఏళ్లుగా పార్టీకి నమ్మకమైన బంటుగా ఉన్న జీవన్ రెడ్డి, గత 20 నెలలుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన జగిత్యాలలోని తన నివాసంలో అనుచరులతో అత్యవసర సమావేశం నిర్వహించడం, పార్టీని వీడతారనే సంకేతాలు ఇవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం జగిత్యాలకు చేరుకుని 'డ్యామేజ్ కంట్రోల్' చర్యలు చేపట్టింది.
ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతో జీవన్ రెడ్డి కి సుదీర్ఘ అనుబంధం ఉందన్నారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్లో కొనసాగాలని మా ఆకాంక్ష.. కాంగ్రెస్ పార్టీని వీడొద్ధని జీవన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. రాజీనామా చేయరనే ఆశతో వెళ్తున్నానని పేర్కొన్నారు.
కాంగ్రెస్ నేతలతో భేటీ అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది పరిష్కారం లేని సమస్యగా మారిందన్నారు. సమస్యకు పరిష్కారం నా దగ్గర లేదు.. వారి దగ్గరా లేదన్నారు. రేపు 10 గంటలకు అందరూ బండారి గార్డెన్కు రావాలని అనుచరులకు, అభిమానులకు పిలుపునిచ్చారు. రేపు భవిష్యత్తు, పయనం ఎలా ఉంటుందో తెలియదన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి స్వపక్షంతో నేను యుద్ధం చేయలేను అన్నారు. నేను నా నిర్ణయం రేపు ప్రకటించాబోతున్నా.. నా నిర్ణయం దైవ నిర్ణయంగా భావిస్తున్నానని ముగించారు.