బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్‌కు నీతా అంబానీ విరాళం.. ఎంతనో తెలుసా.?

నీతా అంబానీ హైదరాబాద్‌లో ప్రముఖ బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి రూ.కోటి విరాళం ఇచ్చారు.

By Knakam Karthik
Published on : 20 Jun 2025 11:59 AM IST

Hyderabad News, Balkampet Yellamma Temple, Nita Ambani, Temple donation

బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్‌కు నీతా అంబానీ విరాళం..ఎంతనో తెలుసా?

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ హైదరాబాద్‌లో ప్రముఖ బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి రూ.కోటి విరాళం ఇచ్చారు. ఈ మొత్తం బుధవారం దేవస్థానం బ్యాంకు ఖాతాలో జమ అయ్యింది. ఈ ఏడాది ఏప్రిల్​ 23న నీతా అంబానీ తల్లి పూర్ణిమ దలాల్​, సోదరి మమతా దలాల్​ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పటి ఆలయ ఈవో కృష్ణ వారికి ఆలయ విశిష్టతను వివరించారు. అలాగే దేవస్థానం అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. ఈ క్రమంలో ఆలయానికి నీతా అంబానీ రూ.కోటి విరాళాన్ని అందించారు. ఈ మొత్తాన్ని బ్యాంకులో ఫిక్స్​డ్​ డిపాజిట్​ చేసి, వచ్చే వడ్డీని నిత్యాన్నదానం కోసం వినియోగించనున్నామని ఆలయ ఇన్​ఛార్జి ఈవో మహేందర్​ గౌడ్​ వివరించారు.

అయితే జులై 1వ తేదీ నుంచి బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం ఘనంగా జరగనుంది. అమ్మవారి కల్యాణ మహోత్సవం, రథోత్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఆలయ అధికారులు వేగంగా చేస్తున్నారు. అలాగే రథోత్సవం కూడా నిర్వహించనున్నారు. అమ్మవారి కల్యాణాన్ని భక్తులు అన్నివైపుల నుంచి వీక్షించేలా ఎల్​ఈడీ స్క్రీన్లు ఏర్పాట్లు చేయనున్నారు. ఆలయ ఆవరణలో మ్యాన్‌హోల్స్‌కు మూతలు సరిచూసుకోవడం, మురుగు నీరు లీకేజీ లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

అలాగే అన్నదాన కార్యక్రమాలు నిర్వహించే వారికి అవసరమైన వాటర్​ ట్యాంకర్లను అందుబాటులో ఉంచనున్నారు. పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం శుభ్రత కోసం మూడు షిఫ్టుల్లో పని చేయనున్నారు. సీసీ కెమెరాలు, హైమాస్ట్​ లైట్లు ఏర్పాటు చేయనున్నారు. వాలంటీర్లకు ఫొటో గుర్తింపు కార్డులు, అలాగే దాతలు, ముఖ్యమైన వారికి ప్రత్యేక పాస్​లు అందించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అధికారులు ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారు.

Next Story