బీఆర్ఎస్‌కు షాక్.. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి రాజీనామా

ఎన్నికల దగ్గరపడుతున్న వేళ తెలంగాణలో రాజీనామాల ట్రెండ్‌ కొనసాగుతోంది.

By Srikanth Gundamalla  Published on  26 Oct 2023 9:57 AM GMT
mlc, kuchukulla damodar reddy, resign, brs, telangana,

బీఆర్ఎస్‌కు షాక్.. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి రాజీనామా

ఎన్నికల దగ్గరపడుతున్న వేళ తెలంగాణలో రాజీనామాల ట్రెండ్‌ కొనసాగుతోంది. ఆయా పార్టీల్లో ఉన్న నాయకులు షాక్‌లు ఇస్తున్నారు. అంతా సరిగ్గా ఉందనుకునే సమయానికి ఒకరి తర్వాత మరొకరు అధిష్టానానికి రాజీనామా లేఖలు పంపుతున్నారు. నిన్నటికి నిన్న బీజేపీలో ఉన్న రాజగోపాల్‌రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి సొంత గూటికి చేరుకున్నారు. తాజాగా పాలమూరు జిల్లాకు చెందిన బీఆర్ఎస్‌ ఎమెమల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి బీఆర్ఎస్‌కు గట్టి షాక్‌ ఇచ్చారు. ఆ పార్టీని వీడుతున్నట్లు చెప్పారు. అంతేకాదు.. ఆయన కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.

ఈ మేరకు ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి తన రాజీనామా పత్రాన్ని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు పంపారు. గత నాలుగున్నరేళ్ల కిందట కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరానని చెప్పారు. అయితే.. తనకు బీఆర్ఎస్‌లో తగినంత ప్రాధాన్యత ఇచ్చిన్నటికీ స్థానికల ఇబ్బందులను సీఎం కేసీఆర్ ఏనాడూ పట్టించుకోలేదని అన్నారు దామోదర్‌రెడ్డి. అందుకే తాను బీఆర్ఎస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను పంపుతున్న రాజీనామాను అంగీకరిస్తారని భావిస్తున్నానని లేఖలో ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి పేర్కొన్నారు.

కాగా.. కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి మాత్రం రాజీనామా చేయలేదు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆదేశిస్తే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని చెప్పారు. అయితే.. నాలుగున్నరేళ్లలో తనకు సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్‌ కూడా దొరకలేదని చెప్పారు. వైఎస్‌ సీఎంగా ఉన్న రోజుల్లో 15 రోజులకు ఒకసారి కలిసే అవకాశం ఉండేదని గుర్తు చేశారు. పార్టీలో మంచి స్థానం కల్పించినా.. స్థానికంగా ఉన్న నేతల అవమానంతో బయటకు రావాల్సి వస్తోందని కూచుకుళ్ల దామోదర్‌ పేర్కొన్నారు. ఈ నెల 31న కొల్లాపూర్‌లో జరిగే సభలో ప్రియాంకగాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు కూచకుళ్ల ప్రకటించారు.

Next Story