బీసీలకు రాజకీయ అవకాశాలు దక్కాలంటే అదొక్కటే మార్గం: ఎమ్మెల్సీ కవిత
తెలంగాణలో 25 వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యే వరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుంది..అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు.
By Knakam Karthik
బీసీలకు రాజకీయ అవకాశాలు దక్కాలంటే అదొక్కటే మార్గం: ఎమ్మెల్సీ కవిత
తెలంగాణలో 25 వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యే వరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుంది..అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఆమె నివాసంలో యూపీఎఫ్ నాయకులు, 72 కులాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే ఇప్పటివరకు రాజకీయ అవకాశాలు దక్కని కులాలకు సబ్ కోటా కల్పించాలి. సర్పంచులు, ఎంపీపీలుగా ఇప్పటివరకు రాజకీయ అవకాశాలు దక్కని ఎన్నో కులాల బీసీలలో ఉన్నాయి. బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచడం ఎంత ముఖ్యమో..రాజకీయ అవకాశాలు దక్కని వారికి పదవులు దక్కేలా సబ్ కోటా కల్పించడం అంతే ముఖ్యం..అని కవిత పేర్కొన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి, అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ పాస్ చేసిన బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయి. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ కేబినెట్ చేసిన సవరణ తీర్మానం గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది. గవర్నర్ కేబినెట్ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసి గెజిట్ జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. గవర్నర్ ఆర్డినెన్స్ ఇచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ వేయకుంటే ఎవరైనా కోర్టుకు వెళ్లి రిజర్వేషన్లకు అడ్డు తగిలే ప్రమాదం ఉంది. ఆ అవకాశం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి. రిజర్వేషన్లు పెంచుతూ చట్ట సవరణ చేసే అవకాశం అధికారం కేంద్రం పరిధిలో ఉంటే.. ఉన్న రిజర్వేషన్లలో సబ్ కేటగరైజేషన్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే. రాజకీయ అవకాశాలు దక్కని కులాల నుంచి సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ ఛైర్మన్లు కావాలంటే సబ్ కేటగరైజేషన్ ఒక్కటే మార్గం. రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ వేయకుండా ఆర్డినెన్స్ ఇస్తే.. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతాం.. దీనిపై న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం..అని కవిత తెలిపారు.