కాంగ్రెస్ గెలిస్తే ఆత్మహత్య చేసుకుంటానని ఎమ్మెల్యే జోగు రామన్న సవాల్

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి ఖామయని చెప్పారు. ఒక వేళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని..

By Srikanth Gundamalla
Published on : 17 Jun 2023 7:59 AM IST

MLA Jogu Ramanna, BRS, Congress, challenge, Revanth Reddy

కాంగ్రెస్ గెలిస్తే ఆత్మహత్య చేసుకుంటానని ఎమ్మెల్యే జోగు రామన్న సవాల్

తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతోన్న కొద్ది రాజకీయ పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. మీరా..మేమా అన్నట్లు సవాళ్లు విసురుకుంటున్నారు. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్‌ పార్టీపై విరుచుకుపడుతున్నారు. ఆయనకు తాజాగా సవాల్‌ విసిరారు బిఆర్ఎస్‌ ఎమ్మెల్యే జోగు రామన్న.

ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే జోగు రామన్న. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి ఖామయని చెప్పారు. ఒక వేళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని అన్నారు. కాంగ్రెస్‌ ఓటమి పాలైతే రేవంత్‌రెడ్డి ఆత్మహత్య చేసుకుంటారా అని సవాల్‌ విసిరారు ఎమ్మెల్యే జోగురామన్న. ఆదిలాబాద్‌కు చెందిన కొందరు నేతలు కాంగ్రెస్‌లో చేరిన సమయంలో రేవంత్‌రెడ్డి తనని అవమానించేలా మాట్లాడరని జోగురామన్న ఫైర్ అయ్యారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన తనను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం రేవంత్‌రెడ్డి తగదని హితవు పలికారు. తనపై చేసిన వ్యాఖ్యలపై రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అయితే.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని 8 స్థానాల్లో ఎవరు గెలవాలనేది రాబోయే రోజుల్లో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న.

Next Story