చెంచుల‌కు 13 వేల ఇందిర‌మ్మ ఇండ్లు..మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

చెంచులు దశాబ్దాల పాటు సొంత ఇండ్ల‌కు నోచుకోలేదని వారి సొంతింటి క‌లను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఇందిర‌మ్మ ప్ర‌భుత్వం సాకారం చేస్తుందని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్ర‌క‌టించారు.

By Knakam Karthik
Published on : 6 July 2025 6:46 PM IST

Telangana, Minister Ponguleti Srinivas reddy Congress Government, Indiramma Indlu

చెంచుల‌కు 13 వేల ఇందిర‌మ్మ ఇండ్లు..మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

సమాజంలో అత్యంత వెనుకబడిన చెంచులు దశాబ్దాల పాటు సొంత ఇండ్ల‌కు నోచుకోలేదని వారి సొంతింటి క‌లను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఇందిర‌మ్మ ప్ర‌భుత్వం సాకారం చేస్తుందని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్ర‌క‌టించారు. రాష్ట్రంలోని ఉట్నూరు, భ‌ద్రాచ‌లం, మున్న‌నూర్‌, ఏటూరు నాగారం నాలుగు స‌మ‌గ్ర గిరిజ‌నాభివృద్ధి సంస్ధ (ఐటిడిఎ)ల ప‌రిధిలోని 21 నియోజకవర్గాలలో స‌చ్యురేష‌న్ ప‌ద్ద‌తిలో 13,266 చెంచు కుటుంబాల‌ను ఇందిర‌మ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామ‌ని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

గిరిజ‌న ప్రాంతాల్లో శాశ్వ‌త గృహాల‌ను నిర్మించాల‌ని రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ ప‌లు సంద‌ర్బాల‌లో సూచించ‌డం జ‌రిగింద‌ని అలాగే రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కూడా అనేక సంద‌ర్బాల‌లో గిరిజ‌న ప్రాంతాల‌లో అభివృద్ది, ముఖ్యంగా వారి నివాస గృహాల నిర్మాణంపై అనేక సూచ‌న‌లు చేశార‌ని గ‌వ‌ర్న‌ర్ , ముఖ్య‌మంత్రి సూచ‌న‌లు స‌ల‌హాల మేర‌కు గిరిజ‌న ప్రాంతాల్లో చెంచులకు ఇందిర‌మ్మ ఇండ్ల‌ను మంజూరు చేస్తున్నామ‌ని తెలిపారు. మొదటి విడతలో భాగంగా సోమవారం నాడు అచ్చంపేట నియోజకవర్గం మున్న‌నూర్‌లో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ తో కలిసి చెంచులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను స్వయంగా తానే అందజేస్తున్నట్లు తెలిపారు.

అడవులను నమ్ముకొని జీవించే గిరిజనులలో చెంచులు ఒక జాతి అని. వీరు అడవుల్లో వేటాడటం, అటవీ ఫలసాయం సేకరించి అమ్ముకొని జీవనం సాగిస్తున్నార‌ని . చిన్నచిన్న గుడిసెలు తప్ప వీరికి పక్కా ఇల్లు ఎలా ఉంటుందో ఊహకు అందని విషయమ‌ని, అలా అని ఆ అడవి ప్రాంతాల్ని వదలి వారు బతక లేరు. అందుకే వీరు జీవించే ప్రదేశంలోనే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింద‌ని. దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన కూడా చేయలేద‌న్నారు. ఉట్నూరు ఐటిడిఎ ప‌రిధిలో (10, 836ఇండ్లు) మంచిర్యాల 157, నిర్మల్ 153, ఆసిఫాబాద్ 3371, బోధ్ 163, ఖానాపూర్ 2257, సిర్పూర్ 227, అదిలాబాద్ 2848, బెల్లంప‌ల్లి 223, భ‌ద్రాచ‌లం ఐటిడిఎ ప‌రిధిలో అశ్వ‌రావుపేట 274, మున్న‌నూర్ చెంచు స్పెష‌ల్ ప్రాజెక్ట్ లో ( 2156) అచ్చంపేట్ 785, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ 245, ప‌రిగి 63, తాండూర్ 174, కొల్లాపూర్ 105, కల్వకుర్తి 120, వికారాబాద్ 63, దేవరకద్ర 64, నాగార్జునసాగర్ 17, మొత్తంగా 13,266 ఇండ్ల‌ను చెంచులకు మంజూరు చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు.

ఈ ఏడాది రాష్ట్రంలో ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి 3500 ఇందిర‌మ్మ ఇండ్లును మంజూరు చేస్తున్నామ‌ని, అయితే ఐటిడిఎ ప‌రిధిలోని గిరిజ‌న నియోజ‌క‌వ‌ర్గాల‌కు అద‌నంగా 500 నుంచి 700 ఇండ్ల చొప్పున 8750 ఇండ్లను మంజూరు చేసినట్లు వెల్ల‌డించారు. గిరిజన ప్రాంతాలలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు నిర్మాణ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఐటిడిఏ ప్రాజెక్టు ఆఫీసర్ ను నోడల్ అధికారిగా నియమించినట్లు తెలిపారు.

Next Story