వరద సహాయం పరిహారం విడుదలపై అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం

వ‌ర‌ద‌ల‌తో దెబ్బ‌తిన్న ప్రాంతాల్లో చేప‌ట్టిన స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను మ‌రింత ముమ్మ‌రం చేయాల‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు.

By -  Knakam Karthik
Published on : 11 Sept 2025 7:42 AM IST

Telangana, Minister Ponguleti, Flood Relief Compensation

హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల కామారెడ్డి, మెద‌క్ జిల్లాల్లో కురిసిన భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో దెబ్బ‌తిన్న ప్రాంతాల్లో చేప‌ట్టిన స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను మ‌రింత ముమ్మ‌రం చేయాల‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచన‌ల మేర‌కు స‌చివాల‌యంలోని త‌న కార్యాల‌యంలో భారీ వ‌ర్షాలతో జ‌రిగిన న‌ష్టం, ఇప్ప‌టివ‌ర‌కు తీసుకున్న స‌హాయ‌క చ‌ర్య‌ల‌పై ఆయా శాఖల వారీగా ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె. రామ‌కృష్ణారావు, రాష్ట్ర ప్ర‌కృతి విప‌త్తుల నిర్వ‌హ‌ణా విభాగం ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్, ఆర్ధిక శాఖ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సుల్తానియాతో క‌లిసి స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్ర‌భుత్వం తీసుకున్న ముంద‌స్తు చ‌ర్య‌ల వ‌ల్ల చాలా వ‌ర‌కు ప్రాణ‌, ఆస్తి న‌ష్టం త‌గ్గింద‌ని అన్నారు. స‌హాయ‌క ప‌నుల‌ను మ‌రింత‌ వేగ‌వంతం చేయాల‌ని ఇప్ప‌టివ‌ర‌కు ప‌రిహారాల‌ను విడుద‌ల చేయ‌క‌పోతే వాటిని వెంట‌నే విడుద‌ల చేయాల‌ని అధికారుల‌కు సూచించారు. ఏ ఒక్క బాధితుడు ప‌రిహారం కోసం ఎదురుచూడాల్సిన ప‌రిస్ధితి లేకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. చెరువులు, కుంట‌లు, రోడ్ల మ‌ర‌మ్మ‌తులకు అత్యంత ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని సూచించారు. వ‌ర్షాల‌తో తీవ్రంగా దెబ్బ‌తిన్న జిల్లాల‌కు రూ.10 కోట్లు, సాధార‌ణ నష్టం జ‌రిగిన జిల్లాల‌కు రూ.5 కోట్ల‌ను విడుద‌ల చేయ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ఆయా జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో స‌మ‌న్వ‌యం చేసుకొని హైద‌రాబాద్ నుంచి ఆయా విభాగాధిప‌తులు నిరంతరం ప‌ర్య‌వేక్షించాల‌ని సూచించారు. వ‌ర‌ద స‌హాయానికి సంబంధించి వినియోగించిన నిధుల‌కు యూసీల‌ను కేంద్రానికి అందించ‌డంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని స‌మావేశంలో మంత్రి అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఈనెల 13వ తేదీలోగా ఆయా విభాగాలు యూసీల‌ను స‌మ‌ర్పించాల‌ని ఆదేశించారు. అల్ప‌పీడ‌నం కార‌ణంగా వ‌చ్చే రెండు రోజుల‌పాటు ప‌లు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌ల నేప‌ధ్యంలో అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.

Next Story