తెలంగాణలోని తహసీల్దార్, ఆర్డీఓ (RDO) కార్యాలయాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అద్దె భవనాల సంస్కృతికి స్వస్తి పలికి, రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్యాలయాలకు సొంత మరియు ఒకే రకమైన (Uniform) భవనాలను నిర్మించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
రెండు దశల్లో ఆధునీకరణ:
తొలి దశలో భాగంగా వెంటనే 60 తహసీల్దార్ కార్యాలయాలు, 5 RDO కార్యాలయాల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. శిథిలావస్థలో ఉన్న మరో 170 కార్యాలయాలను పునర్నిర్మించనున్నారు. అన్ని భవనాలు ఒకే విధమైన ఆర్కిటెక్చర్ డిజైన్తో, ఆధునిక వసతులతో ప్రజలకు అందుబాటులో ఉండేలా నిర్మిస్తారు.
జిల్లాల పునర్విభజన సమయంలో సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే చాలా కార్యాలయాలకు మౌలిక వసతులు లేవని మంత్రి విమర్శించారు. కొన్ని కలెక్టరేట్ భవనాలు ప్రజలకు దూరంగా నిర్మించారని, ఇప్పుడు కొత్త మండలాల్లో పోస్టుల మంజూరు ద్వారా పాలనను గాడిలో పెడుతున్నామని తెలిపారు. రిజిస్ట్రేషన్ సేవలను సులభతరం చేసేందుకు 'క్లస్టర్ మోడల్'ను ప్రవేశపెడుతున్నారు. ORR పరిధిలోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 12 క్లస్టర్లుగా విభజించారు. గచ్చిబౌలిలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ పనులు తుది దశకు చేరుకున్నాయి, ఇది త్వరలోనే ప్రారంభం కానుంది.