జడ్చర్లలో డబుల్ బెడ్ రూం ఇళ్లను.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

Minister KTR inaugurates double bedroom houses in Jadcherla. కొత్త ప్రాజెక్టుల మంజూరు, నిధుల కేటాయింపులో తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని పరిశ్రమల శాఖ మంత్రి కెటి

By అంజి  Published on  4 Feb 2022 11:56 AM GMT
జడ్చర్లలో డబుల్ బెడ్ రూం ఇళ్లను.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

కొత్త ప్రాజెక్టుల మంజూరు, నిధుల కేటాయింపులో తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్వయంగా ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసినా కేంద్రం నుంచి స్పందన లేదన్నారు. శుక్రవారం జడ్చర్ల నియోజకవర్గంలోని కోడ్గల్ గ్రామంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ.. పొరుగున ఉన్న కర్ణాటకలోని ఎగువ భద్ర ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు మంజూరు చేయడం ఆసక్తికరంగా మారిందన్నారు.

అదేవిధంగా మరిన్ని పరిశ్రమల స్థాపనకు, యువతకు ఉపాధి కల్పనకు వీలుగా హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌ను పారిశ్రామిక కారిడార్‌గా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. కానీ కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం రాలేదన్నారు. "కేంద్ర ప్రభుత్వ సహాయంతో సంబంధం లేకుండా, ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. మీ మద్దతు, ఆశీస్సులు కావాలి'' అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. గత ఏడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందాయని చెప్పారు. 'ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్‌, బీజేపీ ప్రభుత్వాలు పాలిస్తున్నాయి. తమ రాష్ట్రాల్లోని గ్రామాల అభివృద్ధిని తెలంగాణలోని గ్రామాలతో పోల్చి చూపాలని కాంగ్రెస్‌, బీజేపీ నేతలకు కేటీఆర్‌ సవాల్‌ విసిరారు.

పల్లె ప్రగతి కార్యక్రమం కింద తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీకి నెలవారీ ఆర్థిక సహాయాన్ని అందజేస్తోంది. ప్రస్తుతం ప్రతి పంచాయతీకి నీటి ట్యాంకర్, ట్రాక్టర్, నర్సరీ తదితర సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. గతంలో తాగునీరు తెచ్చుకునేందుకు మహిళలు చాలా దూరం నడిచి వెళ్లాల్సి వచ్చేదని, ప్రస్తుతం మిషన్‌ భగీరథ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ రక్షిత మంచినీటిని అందిస్తున్నామని చెప్పారు. పొరుగున ఉన్న నల్గొండ జిల్లాలో కృష్ణా నది ప్రవహిస్తున్నప్పటికీ, గత 65 సంవత్సరాల నుండి 2 లక్షల మందికి పైగా ఫ్లోరోసిస్ బారిన పడ్డారు. దశాబ్దాల నాటి ఈ సమస్యను పరిష్కరించడంలో గత ప్రభుత్వం విఫలమైందని, అయితే తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ కింద రక్షిత మంచినీటిని అందించడం ద్వారా సమస్యను పరిష్కరించిందని ఆయన అన్నారు.

''నల్గొండలో ఫ్లోరోసిస్ కేసులు లేవు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో రికార్డు స్థాయిలో వెల్లడించింది'' అని మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో తెలంగాణతో మరే రాష్ట్రం పోటీపడదని అన్నారు. దళిత బంధు, రైతు బంధు, రైతు భీమాతో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై రాయచూర్‌కు చెందిన బిజెపి ఎమ్మెల్యే రాయచూర్‌ను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు.

Next Story