హైదరాబాద్: రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సచివాలయంలో సినిమా నిర్మాతలు, వివిధ సినిమా సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో సినీ కార్మికుల సమ్మె కారణంగా షూటింగ్ లు నిలిపివేయబడినందున, పెండింగ్ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి వివిధ సంఘాల సభ్యులను కోరారు.
సినిమా కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నామని, ఈ కమిటీ అన్ని పక్షాలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. బుధవారం నుండి షూటింగ్స్ పునఃప్రారంభమవుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ను గ్లోబల్ ఫిలిం హబ్గా అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని మంత్రి పునరుద్ఘాటించారు. సినిమా మరియు వినోద రంగంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉండటంతో, అవి ఉత్తమ సినిమా షూటింగ్ లొకేషన్లుగా ఉపయోగించవచ్చని చెప్పారు. ఇది స్థానిక ప్రజలకు ఆదాయాన్ని కల్పించడమే కాకుండా, ఉపాధి అవకాశాలు కూడా పెంచుతుందన్నారు.
సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందని, సమ్మెకు వెళ్లడం సరైన మార్గం కాదని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సీఎం శ్రీ రేవంత్ రెడ్డి పేద సినిమా కార్మికులకు ఇళ్లు ఇవ్వాలని, మౌలిక సదుపాయాలు కల్పించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలన్న లక్ష్యంతో సానుకూలంగా ఉన్నారని మంత్రి చెప్పారు. ఈ సమావేశంలో హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా, వివిధ సినిమా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.