రూ.45 కోట్ల‌తో 100 ప‌డ‌క‌ల ఆస్ప‌త్రి నిర్మాణానికి శంకుస్థాపన‌

Minister Harish Rao laid foundation stone for hospital in Yadagirigutta.వైద్యారోగ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని మొద‌టి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Feb 2023 11:59 AM GMT
రూ.45 కోట్ల‌తో 100 ప‌డ‌క‌ల ఆస్ప‌త్రి నిర్మాణానికి శంకుస్థాపన‌

వైద్యారోగ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని మొద‌టి స్థానంలో నిల‌ప‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని మంత్రి హ‌రీశ్ రావు అన్నారు. గురువారం యాద‌గిరిగుట్ట‌లో రూ.45 కోట్ల‌తో 100 ప‌డ‌క‌ల ఆస్ప‌త్రికి నిర్మాణానికి శంకు స్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌మావేశంలో మంత్రి హ‌రీశ్ రావు మాట్లాడారు.

జిల్లాలో ఇప్పటికే పలు 100 పడకల ఆసుపత్రులు ఏర్పాటు చేశామని, త్వరలోనే యాదాద్రి జిల్లాలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు చెప్పారు. రాష్ట్రంలో మ‌రో 9 వైద్య క‌ళాశాల‌ల ఏర్పాటు త్వ‌ర‌లో చేప‌డుతామ‌ని చెప్పారు. ఉద్యోగ నోటిఫికేష‌న్లు ఇస్తే భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) నేత‌లు కుట్ర‌లు అంటున్నార‌ని మండిప‌డ్డారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 81వేల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు విడుద‌ల చేసిన‌ట్లు తెలిపారు.

అంబేడ్క‌ర్ పేరుతో స‌చివాల‌యం నిర్మిస్తే దాన్ని కూల్చేస్తాం.. త‌వ్వేస్తాం అని అంటున్నారు. పేల్బేటోళ్లు, కూల్చేటోళ్ల చేతికెళ్లే తెలంగాణ మ‌ళ్లీ ఆగం అవుతుంద‌ని మంత్రి అన్నారు. బీజేపీ నేత‌ల్లా బీఆర్ఎస్ అబద్ధాలు చెప్పాల్సిన ప‌ని లేద‌ని.. చేసిందే చెబుతున్నామ‌న్నారు. యాదాద్రి దేవాలయం నిర్మాణం చరిత్రలో అద్భుతంగా చేపట్టామన్నారు. తెలంగాణలోని పత్రి గర్భిణికి రెండు దఫాలుగా న్యూట్రిషన్‌ కిట్‌ను అందిస్తున్నాం.రైతుబంధు కింద రూ.60కోట్లు ఖాతాల్లో జమ చేశామన్నారు. ప్రతి రోజూ రూ.40-50కోట్లతో విద్యుత్‌ను కొనుగోలు చేసి రైతులకు అందిస్తున్నాం. రైతుల మోటార్లకు మీటర్లు బిగించకుండా ఉచిత కరెంటు అందిస్తున్నాం. ప్ర‌జ‌లు బీఆర్ఎస్‌కే ఓటు వేస్తార‌ని మంత్రి హరీశ్ రావు అన్నారు.

Next Story