కాంగ్రెస్‌లో టికెట్లు అమ్ముకుంటున్నారు: మంత్రి హరీశ్‌రావు

తెలంగాణలో BRSకి పోటీ లేరని హరీశ్‌రావు అన్నారు. బీజేపీకి క్యాడర్ లేదు.. కాంగ్రెస్‌కు క్యాండిడేట్‌లు లేరని విమర్శించారు.

By Srikanth Gundamalla  Published on  22 Aug 2023 10:16 AM GMT
Minister Harish Rao,  Congress, Medak,

 కాంగ్రెస్‌లో టికెట్లు అమ్ముకుంటున్నారు: మంత్రి హరీశ్‌రావు

మెదక్‌ జిల్లాలో బుధవారం సీఎం కేసీఆర్ పర్యటిస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయం, పోలీస్‌ కార్యాలయం, జిల్లా పార్టీ ఆఫీస్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. నర్సాపూర్‌ మీదుగా సీఎం కేసీఆర్ రోడ్డుమార్గాన మెదక్‌ చేరుకుని.. మధ్యాహ్నం ఒంటి గంటకు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1:30 గంటలకు పోలీస్‌ కార్యాలయాన్ని ప్రారంభిస్తారని.. మధ్యాహ్నం 1:40 నిమిషాలకు సమీకృత కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

తెలంగాణ ఏర్పడ్డాక ప్రజల రాష్ట్ర ప్రజలకు అన్ని సమకూరాయని.. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. వికలాంగుల ఆసరా పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ మెదక్ నుంచే ప్రారంభిస్తారని తెలిపారు. బీడీ కార్మికులకు పెన్షన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. టేకేదార్లు, ఫ్యాకర్స్‌కు సైతం పెన్షన్లు ఇస్తామని హరీశ్‌రావు అన్నారు. రేపు మధ్యాహ్నం 3: 30 గంటలకు మెదక్‌లో భారీ బహిరంగ సభ ఉంటుందనీ.. ఈ సభకు చాలా ప్రాధాన్యత ఉందని హరీశ్‌రావు తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రగతి శంఖారావాన్ని మెదక్‌ నుంచే పూరిస్తారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్‌ ఘన విజయం సాధిస్తుందని.. ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని హరీశ్‌రావు దీమా వ్యక్తం చేశారు. అభ్యర్థులను ముందే ప్రకటించడం తమ గెలుపునకు నిదర్శనమని చెప్పారు. అయితే.. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 10కి పది స్థానాలను గెలిచి కేసీఆర్‌కు కానుకగా ఇస్తామని హరీశ్‌రావు చెప్పారు.

తెలంగాణలో బీఆర్ఎస్‌కు పోటీ ఎవరూ లేరని హరీశ్‌రావు అన్నారు. బీజేపీకి క్యాడర్ లేదు.. కాంగ్రెస్‌కు క్యాండిడేట్‌లు లేరని విమర్శించారు. కాంగ్రెస్‌లో కొట్లాడుతూ.. టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్రంలో డీలా పడిపోయిందని విమర్శించారు. కేసీఆర్ వ్యూహాలను ఎవరూ అందుకోలేరని అన్నారు హరీశ్‌రావు. తెలంగాణ బీఆర్ఎస్‌ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి అయ్యిందని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఉన్న రైతులు కేసీఆర్ పథకాలను కోరుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తామని.. అందుకు బీఆర్ఎస్‌ అభ్యర్థులు, సీఎం కేసీఆర్‌ను మరోసారి ఆశీర్వదించాలని మంత్రి హరీశ్‌రావు ప్రజలను కోరారు.

Next Story