గోషామహల్ ఎమ్మెల్యేకు మెటా షాక్..ఫేస్బుక్, ఇన్స్టా అకౌంట్స్ తొలగింపు
బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ షాక్ ఇచ్చింది.
By Knakam Karthik Published on 21 Feb 2025 11:09 AM IST
గోషామహల్ ఎమ్మెల్యేకు మెటా షాక్..ఫేస్బుక్, ఇన్స్టా అకౌంట్స్ తొలగింపు
బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ షాక్ ఇచ్చింది. ఆయనకు సంబంధించిన ఫేస్ బుక్, ఇన్స్టా గ్రామ్ అకౌంట్లను రిమూవ్ చేసింది. ఆయన పేరుతో ఉన్న రెండు ఫేస్ బుక్ పేజీలు మూడు ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లను తొలగించింది. సోషల్ మీడియాలో ద్వేష పూరిత ప్రసంగాలను వ్యాపి చేస్తున్నట్లు ఇండియా హేట్ ల్యాబ్ నివేదిక వెల్లడించిన వారం రోజుల తర్వాత మెటా ఈ మేరకు చర్యలు తీసుకుంది. కాగా తొలగించిన ఫేస్ బుక్ గ్రూపుల్లో సుమారు 10 లక్షల మందికి పైగా సభ్యులుగా ఉండగా, ఇన్స్టా అకౌంట్లలో లక్షా 55 వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.
కాగా, 2020లోనే తన ప్లాట్ఫామ్స్ నుంచి రాజాసింగ్పై మెటా నిషేధం విధించింది. అయితే ఆయన మద్దతుదారులు కొత్త మార్గాల ద్వారా గ్రూపులు, పేజీలను సృష్టించారు. వాటిలో ఎప్పటికప్పుడు రాజాసింగ్కు చెందిన ప్రసంగాలు, కార్యాకలాపాలకు సంబంధించిన వివరాలు షేర్ చేస్తున్నారు. అయితే ఇటీవల ఆయన రెచ్చగొట్టేలా పెట్టిన కొన్ని పోస్టులే నిషేధానికి కారణమని తెలుస్తున్నది.
2024 లోక్సభ ఎన్నికలు జరిగిన ఏప్రిల్, జూన్ నెలల మధ్య బీజేపీ సీనియర్ నాయకులు చేసిన 266 మైనారిటీ వ్యతిరేక ద్వేషపూరిత ప్రసంగాలు అధికారిక పార్టీ ఖాతాల ద్వారా యూట్యూబ్, ఫేస్బుక్ ఎక్స్ లలో ప్రత్యక్ష ప్రసారం చేశారని ఐహెచ్ఎల్ నివేదిక పేర్కొన్నది. ఫేస్బుక్లో పోస్ట్ చేసిన రాజా సింగ్ ద్వేషపూరిత ప్రసంగాల్లో 74.5 శాతం ద్వేషపూరితమని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఆయన చేసిన 32 హేట్ స్పీచుల్లో 22 ప్రత్యక్షంగా హింసకు ప్రేరేపించేవిలా ఉన్నాయని పేర్కొంది. ప్రధానంగా ముస్లింలు, క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని ఆ ప్రసంగాలు ఉన్నాయని తెలిపింది. వాటిలో 16 స్పీచ్లను యూట్యూబ్లో, 13 ప్రసంగాలను ఫేస్బుక్లో అప్లోడ్ చేశారని వెల్లడించింది.