మా హృదయాల్లో మన్మోహన్ స్థానం శాశ్వతం: రేవంత్
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మరించుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
By అంజి Published on 27 Dec 2024 10:57 AM ISTమా హృదయాల్లో మన్మోహన్ స్థానం శాశ్వతం: రేవంత్
హైదరాబాద్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మరించుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ''అగాధపు అంచుల నుండి.. అద్భుత ప్రస్థానం వరకు.. భారతీయ ఆర్ధిక వ్యవస్థకు.. భాగ్య విధాత.. మన్మోహన్ జీ.. మా హృదయాల్లో మీ స్థానం శాశ్వతం'' అని పేర్కొన్నారు. ఇవాళ సీఎం ఢిల్లీకి వెళ్లనున్నారు. మన్మోహన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించనున్నారు.
''మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్ధిక వేత్త, మహా నాయకుడు, సంస్కరణ వాది అన్నింటికి మించి గొప్ప మానవతావాది'' అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతితో దేశం ఒక గొప్ప కుమారుడిని కోల్పోయిందని సీఎం ఒక సందేశంలో అవేదన వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల ముఖ్యమంత్రి సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని సీఎం తెలియజేశారు.
నిర్ణయాలు తీసుకోవడంలో సమగ్రత, పారదర్శకత అన్నింటికీ మించి మానవీయ స్పర్శను జోడించేవారని, నవ భారత శిల్పుల్లో మన్మోహన్ సింగ్ ఒకరని కొనియాడారు. రాజకీయ, ప్రజా జీవితంలో గౌరవ మర్యాదలు ఎలా పాటించాలో ఆయన తన ప్రవర్తన ద్వారా చూపించారని సీఎం రేవంత్ పేర్కొన్నారు.