'మంత్రి నిరంజన్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉంది... రక్షించండి'

మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డితో పాటు పోలీసు అధికారి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఓ వ్యక్తి మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు.

By అంజి  Published on  28 Feb 2023 8:45 AM GMT
Singireddy Niranjan Reddy, Police, Telangana

తెలంగాణ రాష్ట్ర మంత్రి నిరంజన్‌ రెడ్డి

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డితో పాటు పోలీసు అధికారి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఓ వ్యక్తి తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు. మంత్రిని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు కొత్తకోట పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తనను అరెస్ట్ చేసి కొట్టారని వనపర్తి జిల్లాకు చెందిన శివ కుమార్ యాదవ్ ఆరోపించారు. కొన్ని వెనుకబడిన తరగతుల సంస్థల సహాయంతో శివకుమార్‌ యాదవ్, పోలీసు అధికారిపై చర్య తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

మంత్రి, సీఐ నుంచి తనకు ప్రాణహాని ఉందని కూడా ఆయన ప్యానెల్‌కు తెలిపారు. ఫిబ్రవరి 22వ తేదీ రాత్రి తనను పోలీస్ స్టేషన్‌లో ఉంచారని, సీఐ తనను శారీరకంగా హింసించారని ఆరోపించారు. పోలీసు స్టేషన్‌లో తనను కొట్టారని న్యాయమూర్తికి చెబితే, అతని కుటుంబ సభ్యులను తప్పుడు కేసుల్లో ఇరికించి, ఎన్‌కౌంటర్‌లో చంపేస్తామని పోలీసు అధికారి శివకుమార్‌ యాదవ్‌ను హెచ్చరించినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. ఇద్దరు కానిస్టేబుళ్లు తన మొబైల్‌ను తీసుకెళ్లారని, తాను పోలీసు స్టేషన్‌కు వెళ్లగా, వాట్సాప్‌లో మంత్రికి వ్యతిరేకంగా పోస్ట్ చేసినందుకు అధికారి తనను కొట్టారని ఫిర్యాదుదారు తెలిపారు.

సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ యాదవ్ ఇప్పటికే జిల్లాలోని పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. శివ కుమార్‌ యాదవ్‌ను కొట్టిన పోలీసు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ రాజకీయ జేఏసీ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. మంత్రి నిరంజన్‌రెడ్డి, సీఐ వ్యవహారశైలిపై హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.


Next Story