తెలంగాణలోని ఆగ్రామంలో లాక్‌డౌన్‌..!

Lockdown in gopalpet.తాజాగా నిర్మ‌ల్ జిల్లా సారంగాపూర్ మండ‌లం గోపాల్‌పేట‌లో స్వ‌చ్చంద లాక్‌డౌన్.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 April 2021 2:58 PM GMT
lockdown in Village

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా సెకండ్ వేవ్ శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతోంది. గ‌త కొద్ది రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతోంది. ప‌ట్ట‌ణాలు, ప‌ల్లెలు అని తేడా లేకుండా అన్ని చోట్లా క‌రోనా కేసులు న‌మోదు అవుతున్నాయి. కొంత మంది జాగ్ర‌త్త‌గా ఉండ‌క‌పోవ‌డంతో వారి వ‌ల్ల అనేక మంది క‌రోనా మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు. తాజాగా నిర్మ‌ల్ జిల్లా సారంగాపూర్ మండ‌లం గోపాల్‌పేట‌లో గురువారం ఒక్క రోజే 75 మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 34 మందికి పాజిటివ్‌గా నిర్థార‌ణ అయిన‌ట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆగ్రామంలో పాజిటివ్ కేసుల సంఖ్య 70కి చేరింది.

మూడు నాలుగు రోజులుగా ప్ర‌తి రోజు ప‌దికి మించి కేసులు న‌మోదు అవుతుండ‌డంతో ఆ గ్రామంలోని గ్రామ‌స్తులు అప్ర‌మ‌త్తం అయ్యారు. స‌ర్పంచ్ లింగ‌వ్వ అధ్యక్ష‌త‌న గ్రామాభివృద్ది సంఘం స‌భ్యులు, గ్రామ‌స్తులతో స‌మావేశం అయ్యారు. స్వ‌చ్చంద లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు ఆ స‌మావేశంలో ప్ర‌క‌టించారు. కాగా.. గ్రామం నుంచి రోజు 25 మంది కూర‌గాయ‌లు, పాల విక్ర‌యానికి నిర్మ‌ల్ వెళ్లి వ‌స్తుంటార‌ని.. క‌రోనా వ్యాప్తికి ఇది కార‌ణ‌మై ఉండొచ్చున‌ని గ్రా‌మస్తులు బావిస్తున్నారు. కేసులు పెరుగుతుండ‌డంతో రేపు ప్ర‌త్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు.

ఇదిలా ఉంటే.. నేడు తెలంగాణ‌లో 2,055 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదు అయిన కేసుల సంఖ్య 3,18,704 కి చేరింది. నిన్న క‌రోనా ఏడుగురు మృత్యువాత ప‌డ్డారు. దీంతో క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 1,741కి చేరింది. నిన్న ఒక్క రోజే 303 మంది కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 3,03,601కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 13,362 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. వీరిలో 8,263 మంది హోం ఐసోలేష‌న్‌లో చికిత్స పొందుతున్నారు. కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 398, మేడ్చల్‌ జిల్లాలో 214, రంగారెడ్డిలో 174, నిజామాబాద్‌లో 169 చొప్పున ఉన్నాయి.


Next Story