గత పదేళ్లుగా మోదీ ప్రభుత్వం ప్రజలకేం చేసిందో ప్రశ్నిద్దాం: టీపీజేఏసీ

''గత పదేళ్లుగా మోదీ ప్రభుత్వం ప్రజలకేం చేసిందో ప్రశ్నిద్దాం" అని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు టీపీజేఏసీ రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్ పిలుపునిచ్చారు.

By అంజి  Published on  2 May 2024 1:45 PM GMT
Modi government, TPJAC, Telangana

గత పదేళ్లుగా మోదీ ప్రభుత్వం ప్రజలకేం చేసిందో ప్రశ్నిద్దాం: టీపీజేఏసీ 

''గత పదేళ్లుగా కేంద్రంలో మోడీ ప్రభుత్వం చేసిన నిరంకుశ, ప్రజావ్యతిరేక పాలనను, అవినీతిని ప్రశ్నించండి" అని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు టీపీజేఏసీ రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్ పిలుపునిచ్చారు. తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (TPJAC) ఆధ్వర్యంలో రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మే 2 నుండి మే 11 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న 10 రోజుల ప్రచార కార్యక్రమాన్ని ఈ రోజు ఉదయం 11 గంటలకు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ ప్రొ. హరగోపాల్, కొ-కన్వీనర్లతో బాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు, పౌర సమాజ ప్రతినిధులు పాల్గొన్నారు.

రాష్ట్ర కన్వీనర్ ప్రొ. హరగోపాల్ సమావేశంలో మాట్లాడుతూ.. “ప్రజల నిజమైన ఆకాంక్షలను ఎన్నికలలో ప్రచారంలోకి తీసుకు రాకుండా, బీజేపీ నాయకులు, ముఖ్యంగా దేశ ప్రధాని మోదీ.. ముస్లిం లు, మంగళ సూత్రాలు లాంటి అంశాలను ప్రస్తావిస్తూ, చర్చను పక్కదారి పట్టిస్తున్నారని” అని విమర్శించారు. “గత పదేళ్ళలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దివాళా తీసిందని, నిరుద్యోగం, ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, ప్రజలు నిత్య జీవిత సమస్యలతో పోరాడుతున్నారని, కానీ వీటిని పట్టించుకోకుండా.. మతం, దేవుడు, ముస్లిం ప్రజలపై విద్వేషం పునాదిగా మోదీ ప్రచారం సాగిస్తున్నారని, దీనిని తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలని” ప్రొ. హరగోపాల్ పిలుపు ఇచ్చారు.

సమావేశంలో ప్రొఫెసర్ రమా మేల్కొటె ప్రసంగిస్తూ.. ''బీజేపీ నాయకులు నైతిక విలువలు కూడా విస్మరిస్తున్నారని, బెంగళూర్ లో బీజేపీ భాగస్వామ్య పార్టీ నాయకుడు స్త్రీలపై జరిపిన అత్యాచారాలు జుగుప్సాకరంగా ఉన్నాయనీ, అటువంటి వ్యక్తికి మోదీ ప్రచారం చేశారని'' విమర్శించారు. “తెలంగాణ ప్రజలు మత సామరస్యంతో శతాబ్ధాల పాటు జీవించారని , ఇప్పడు ఆ సామరస్య వాతావరణాన్ని బీజేపీ నాయకులు విద్వేషంతో నింపుతున్నారనీ , ప్రజలు వాళ్ళ మాయలో పడకుండా ఉండాలని”ఆమె కోరారు.

సమావేశంలో తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండ రామ్ ప్రసంగిస్తూ.. 'మోదీ ఆర్ధిక విధానాల వల్ల, కోట్లాది మంది బిలియనీర్లుగా మారారని, దేశ సంపదను దోచుకున్నారని, మిగిలిన ప్రజలు పేదరికంలో కూరుకుపోయారని, దేశంలో ఆర్ధిక వ్యత్యాసాలు బాగా పెరిగిపోయాయని విమర్శించారు. ఏ సమయంలోనూ బీజేపీని కేంద్రంలో మళ్ళీ అధికారంలో రాకుండా, ప్రజలు చిత్తుగా ఓడించాలి' అని ఆయన పిలుపు ఇచ్చారు.

సమావేశంలో భారత్ జోడో అభియాన్ జాతీయ నాయకులు కవిత కురుగంటి మాట్లాడుతూ.. దేశమంతా ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో బీజేపీ వ్యతిరేక గాలులు వీస్తున్నాయని, అందుకే మోదీ మత విధ్వేషాలు రెచ్చగొట్టడానికి పూనుకుంటున్నాడని అన్నారు. దక్షిణాదిలో బీజేపీకి ఏ మాత్రం స్థానం లేకుండా చేయాలని ఆమె కోరారు.

ఈ ప్రచార కార్యక్రమం రాబోయే పది రోజులు రాష్ట్ర మంతా జరుగుతుందని, జిల్లాల వారీ స్థానిక యాత్రలు, ర్యాలీలు, సభలు, పత్రికా విలేఖరుల సమావేశాల రూపంలోనూ, కరపత్రాలు, పోస్టర్ల ప్రచారం రూపంలోనూ, వాస్తవ పరిస్థితులను, బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించవలసిన అవసరాన్ని ప్రజలలోకి తీసుకు వెళ్తామని TPJAC కో కన్వీనర్లు కన్నెగంటి రవి, రవి చందర్, మైసా శ్రీనివాస్ వివరించారు. మే 3, 4 తేదీలలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో యాత్ర జరుగుతుందని, మిగిలిన అన్ని జిల్లాలలో స్థానిక యాత్రలు జరుగుతాయని, అన్ని మండల కేంద్రాలలో సమావేశాలు ఉంటాయని ఈ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Next Story