మంత్రి కేటీఆర్‌ ఆర్థికసాయం.. కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు

KTR helps two meritorious girls pursue their education. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పిడిసిల్ల గ్రామానికి చెందిన 21 ఏళ్ల కావేరి, 18 ఏళ్ల శ్రావణి మెడిసిన్,

By అంజి  Published on  7 March 2022 2:08 AM GMT
మంత్రి కేటీఆర్‌ ఆర్థికసాయం.. కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పిడిసిల్ల గ్రామానికి చెందిన 21 ఏళ్ల కావేరి, 18 ఏళ్ల శ్రావణి మెడిసిన్, ఇంజినీరింగ్ కోర్సులు పూర్తి చేసేందుకు ఆర్థిక సహాయం అందజేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు హామీ ఇచ్చారు. సోదరీమణులిద్దరూ టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌, టీఎస్‌ మోడల్ స్కూల్‌లో చదువుకున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా వారి పరిస్థితిని తెలుసుకున్న మంత్రి కేటీఆర్‌ విద్యార్థులకు సహాయం అందించారు. ఆదివారం కావేరి, శ్రావణి ఇద్దరూ తమ తండ్రి కోతుల రాజ మల్లుతో కలిసి హైదరాబాద్‌ నగరంలో మంత్రి కేటీఆర్‌ని కలిశారు.

పొలిటికల్ సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన రాజ మల్లు ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేశారు. కోవిడ్ సమయంలో, అతను ఉద్యోగం కోల్పోయాడు. ప్రస్తుతం రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. ఇంటర్మీడియట్‌లో 95 శాతం ఉత్తీర్ణత సాధించిన కావేరి సిద్దిపేటలోని సురభి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశం పొందింది. అదేవిధంగా శ్రావణి ఇంటర్మీడియట్‌లో 97 శాతం సాధించి, ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిగూడెంలోని ఎన్‌ఐటీలో బీటెక్ (ఈసీఈ)లో ప్రవేశం పొందింది.

ఇద్దరు విద్యార్థులు ఉచిత సీట్లు పొందగా.. వారు హాస్టల్, మెస్ ఛార్జీలతో సహా ఇతర ఫీజులను చెల్లించలేకపోయారు. విద్యార్థులిద్దరూ కోర్సులు పూర్తయ్యే వరకు ఆర్థిక సహాయం అందజేస్తామని మంత్రి కెటి రామారావు హామీ ఇచ్చారు. వారి భవిష్యత్ కార్య‌క్ర‌మాలు స‌క్సెస్ కావాల‌ని మంత్రి ఆకాంక్షించారు. ఆర్థిక సహాయం అందించి తమ విద్యను పూర్తి చేయడంలో సహకరించినందుకు విద్యార్థులిద్దరూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

Next Story