వరద బాధితులపై సర్వే.. అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు

Khammam Collector asks officials to hold survey on flood-hit victims. గోదావరి వరదలతో తీవ్రంగా నష్టపోయిన వారిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే

By అంజి  Published on  20 July 2022 10:50 AM GMT
వరద బాధితులపై సర్వే.. అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు

గోదావరి వరదలతో తీవ్రంగా నష్టపోయిన వారిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ వీపీ గౌతమ్‌ పర్యటించారు. జిల్లాలో వరద బాధితుల సర్వే నిర్వహించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ బుధవారం అధికారులను కోరారు. ఈ సందర్భంగా బూర్గంపాడ్ కార్యాలయంలో అధికారులతో మాట్లాడారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. సర్వే బృందాలు ఇంటింటికీ సర్వే నిర్వహించి బాధితుల నుంచి సమాచారం సేకరించాలన్నారు. కుటుంబంలోని సభ్యుల సంఖ్య, వారి ఆర్థిక పరిస్థితి, వారు ఎంత నష్టపోయారు, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు సేకరించాలని ఆయన వారికి సూచించారు.

ఏ ఒక్క వరద బాధితుడు మిస్‌ కావొద్దని, పారదర్శకంగా వ్యవహరించాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. సహాయక కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న బాధితుల నుంచి కూడా అధికారులు సమాచారాన్ని సేకరించి తుది నివేదికలో చేర్చవచ్చని తెలిపారు. బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలని అధికారులకు సూచించారు. వరద బాధితులను ఎవరినీ వదలకుండా సర్వేలు నిర్వహించాలని తహశీల్దార్లు, ఎంపీడీఓలను ఆదేశించారు. వీలైనంత త్వరగా సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

బూర్గంఫాడ్, సారపాక గ్రామాల బాధితులను ఆదుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. బూర్గంపాడులో వరద ప్రభావిత 9 కాలనీలకు 9 బృందాలు, 6 కాలనీలకు 6 బృందాలను ఏర్పాటు చేసి సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. షెల్టర్లలో బాధితులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. బాధితుల నుంచి సమాచారం సేకరించినట్లు తెలిపారు.

Next Story