'రూ.లక్ష ఇచ్చి చేతులు దులుపుకుంటారా?'.. జైనూరు ఘటనపై కేటీఆర్‌

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌ మండలంలో ఒక ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచారయత్నం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

By అంజి  Published on  5 Sep 2024 6:09 AM GMT
BRS leader KTR, Jainoor, Asifabad, Telangana

'రూ.లక్ష ఇచ్చి చేతులు దులుపుకుంటారా?'.. జైనూరు ఘటనపై కేటీఆర్‌

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌ మండలంలో ఒక ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచారయత్నం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. జైనూర్‌లో జరిగిన హింసాత్మక చర్యల్లో అనేక ఆస్తుల విధ్వంసం జరగడం దురదృష్టకరమని అన్నారు. బాధిత మహిళకు కేవలం లక్ష రూపాయల "పరిహారం" ఇచ్చి చేతులు దులుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం దుర్మార్గం అని అన్నారు.

ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్నాయని ముందస్తు సమాచారం ఉన్నా వాటిని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని కేటీఆర్‌ ఆరోపించారు. జైనూర్‌లో తక్షణమే శాంతి నెలకొనేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత మహిళకు మెరుగైన వైద్యం అందించి, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని, అల్లర్లలో ఇళ్లు, షాపులు కోల్పోయినవారికి సాయంగా నిలవాలని ప్రభుత్వాన్ని కోరారు. పూర్తి స్థాయి హోం మంత్రి లేకుండానే తొమ్మిది నెలలుగా రాష్ట్రాన్ని నడపడం వల్లనే తరచూ ఇటువంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని కేటీఆర్‌ అన్నారు.

Next Story