తెలంగాణ ఎన్నికల వేళ.. అమ్మకానికి కేసీఆర్ గుడి

తెలంగాణ ఉద్యమకారుడు గుండా రవీందర్.. కేసీఆర్‌‌ మీద అభిమానంతో నిర్మించిన గుడిని ఇప్పుడు అమ్మకానికి పెట్టాడు.

By అంజి  Published on  22 Nov 2023 4:30 AM GMT
KCR temple, KCR temple sale, Telangana elections, BRS

తెలంగాణ ఎన్నికల వేళ.. అమ్మకానికి కేసీఆర్ గుడి

ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును అభిమానించిన గుండ రవీందర్ 2016లో దండేపల్లిలోని ఆయన నివాసంలో చిన్నపాటి గుడి నిర్మించి.. అప్పటి నుంచి కేసీఆర్ విగ్రహానికి పూజలు చేశారు. అయితే బీఆర్‌ఎస్‌ అధినేత నుంచి సపోర్ట్‌ లేకపోవడంతో ఇప్పుడు రవీందర్‌ ఆలయాన్ని అమ్మకానికి పెట్టారు. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన రవీందర్‌ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం సందర్భంగా బీఆర్‌ఎస్‌ కార్యకలాపాలకు మంత్రముగ్ధులయ్యారు. కేసీఆర్ పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ తన ఇంటి ముందు రూ.2లక్షలు వెచ్చించి చిన్నపాటి గుడి నిర్మించారు.

మంచిర్యాల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఎన్. దివాకర్ రావు విస్మరించారని భావించిన రవీందర్, కేసీఆర్ గుడి కట్టి తాను ఆర్థికంగా ఎంతో నష్టపోయానని, అందుకే గుడిని అమ్మకానికి పెట్టినట్లు వెల్లడించారు. ఇంకా తాను ఆహ్వానించినప్పటికీ, ఆలయ ప్రారంభోత్సవానికి బీఆర్‌ఎస్‌ నాయకులు హాజరుకాకపోవడంతో తాను చిన్నగా భావించానని రవీందర్ వాపోయాడు. ఆలయ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్సీ కె.కవితతోపాటు బీఆర్‌ఎస్‌ నాయకులను, మంచిర్యాల జిల్లా నేతలను ఆహ్వానించినట్లు తెలిపారు. కేసీఆర్‌ గుడి అమ్మకానికి సంబంధించిన వివరాలతో గుడి వద్ద ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆసక్తి గల వారు కేసీఆర్ గుడి, విగ్రహాన్ని కొనుగోలు చేసి తనను ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌తో తనకు మంచి సాన్నిహిత్యం ఉండేదని, అయితే ప్రగతి భవన్‌లో సీఎంను సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవటంతో నిరాశ చెందానని రవీందర్‌ అన్నారు. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్‌ను సీఎం గౌరవించడం లేదని, దాని ఆధారంగా ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేసి, తమకు జరిగిన నీళ్లు, నిధులు, నియమాకాల అన్యాయాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవడం లేదని కేసీఆర్ గుడి విక్రయం ఓటర్లకు తప్పుడు సంకేతాలు పంపుతుంది. కేసీఆర్‌ గుడి అమ్మకం రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.

Next Story