Telangana: కొత్త సచివాలయానికి రక్షణగా 650 మంది సిబ్బంది, 300 సీసీ కెమెరాలు

లాంఛనంగా ప్రారంభోత్సవానికి ముందు తెలంగాణలో కొత్తగా నిర్మించిన సచివాలయ భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

By అంజి  Published on  21 April 2023 8:45 AM GMT
Telangana, new secretariat,KCR government , SPF, TSSP

Telangana: కొత్త సచివాలయానికి రక్షణగా 650 మంది సిబ్బంది, 300 సీసీ కెమెరాలు

హైదరాబాద్: లాంఛనంగా ప్రారంభోత్సవానికి ముందు తెలంగాణలో కొత్తగా నిర్మించిన సచివాలయ భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీని బాధ్యతను ఎస్పీఎఫ్‌కు అప్పగించారు. సచివాలయం ప్రారంభోత్సవం తర్వాత 650 మందికి పైగా సిబ్బందిని మోహరిస్తారు. పలు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాల అనంతరం సచివాలయ భద్రత బాధ్యతలను టీఎస్‌ఎస్పీకి అప్పగించాలని నిర్ణయించారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రారంభోత్సవం ఏప్రిల్ 30న జరగనుంది.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అదే రోజు మధ్యాహ్నం 1.20 గంటలకు తన ఛాంబర్‌లో కుర్చీని స్వీకరించనున్నారు. 350 కంటే ఎక్కువ టీఎస్ఎస్‌పీ కేడర్లు, దాదాపు 300 ఆర్మ్డ్ రిజర్లు (CAR).. లా అండ్ ఆర్డర్ పోలీస్ సెక్యూరిటీని పర్యవేక్షిస్తారు. వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు 22 మంది ట్రాఫిక్ పోలీసులను కూడా మోహరిస్తున్నారు. ఎంపికైన పోలీసు సిబ్బందికి ఇప్పటికే మొయినాబాద్‌లోని ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ (ఐఐటీఏ)లో శిక్షణ ఇచ్చారు. త్వరలోనే సేవలు ప్రారంభం కానున్నాయి.

సచివాలయానికి వచ్చే సామాన్య ప్రజలను ముందస్తు అనుమతి లేకుండా లోనికి అనుమతించరు. ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే సంబంధిత బ్లాక్‌కి వెళ్లేందుకు అనుమతిస్తారు. దీని కోసం, వారికి ప్రవేశ ద్వారం వద్ద బార్‌కోడ్‌తో పాస్‌లు ఇవ్వబడతాయి. వారు ఇతర బ్లాక్‌లకు వెళ్లలేరు. ఈ విషయాలన్నింటినీ హైదరాబాద్ సిటీ పోలీస్ డిపార్ట్‌మెంట్ పర్యవేక్షిస్తుంది. సచివాలయం చుట్టూ ఉన్న కేంద్ర పోస్టుల వద్ద సాయుధ సిబ్బంది కాపలా కొనసాగుతారు. ప్రవేశ ద్వారం వద్ద ఉన్న మరో రెండు పోస్టులకు కూడా రక్షణ కల్పించారు.

దీంతోపాటు ముఖ్యమంత్రి కార్యాలయం, హోంశాఖ వంటి కీలక ప్రాంతాల్లో భద్రతా సిబ్బందికి ఆధునిక ఆయుధాలు అమర్చనున్నారు. ఆరు అంతస్తుల సచివాలయంలోని మెట్లు, లిఫ్ట్‌ల దగ్గర కట్టుదిట్టమైన పోలీసు సిబ్బందిని మోహరిస్తారు. 300 సీసీటీవీ కెమెరాలు కదలికలపై నిఘా పెడతాయి. పరిస్థితిని గమనించేందుకు ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. అగ్ని ప్రమాదం జరగకుండా సచివాలయ ప్రాంగణంలో రెండు అగ్నిమాపక దళాలు, 34 మంది సిబ్బందిని మోహరిస్తారు.

Next Story