తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల వేళ ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఒక విద్యార్థి ఫలితాలు విడుదల కావడానికి కొన్ని గంటల ముందే ఆత్మహత్య చేసుకున్నాడు. బోనకల్ మండలం రాపల్లి గ్రామానికి చెందిన గంగదేవుళ్ల అక్షాంత్ అనే ఇంటర్ మొదటి సంవత్సరం (MPC) విద్యార్థి, మధిర సమీపంలో రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు.
అయితే, ఆదివారం విడుదలైన ఫలితాల్లో అక్షాంత్ 347 మార్కులతో పాస్ అయినట్లు తేలింది. కొడుకు మంచి మార్కులతో ఉత్తీర్ణుడైన ఆనందం కంటే, ఫలితాలు రాకముందే తనువు చాలించాడనే వార్త ఆ కుటుంబాన్ని కలిచివేస్తోంది. ఈ ఘటనతో రాపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో 66.02 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, గర్ల్స్ 74.40 శాతం, బాయ్స్ 57.69 శాతం పాస్ అయ్యారు.