'మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ వస్తుంది.. మీ వడ్లు తీసేయండి' అంటూ రైతులపై ఎమ్మార్వో దౌర్జన్యానికి దిగాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నెరేడుచర్లలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సొంత పొలంలో ఆరపోసుకున్న వడ్లు తీసేయాలని రైతులకు అధికారుల హుకుం జారీ చేశారు. తాము చెప్తే ఇప్పటికిప్పుడు వడ్లు తీయాల్సిందేనని, వీడియోలు తీసి ఏం చేస్తారు.. ఏం చేయలేరు అంటూ రైతులపై ఎమ్మార్వో దౌర్జన్యానికి పాల్పడ్డారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ కోసం అధికారులు రైతులను ఇబ్బంది పెట్టారు. ధాన్యం ఆరబోసుకున్న పొలం వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని, ఉన్న పలంగా ధాన్యం మొత్తాన్ని ఖాళీ చేయాలని అధికారులు ఆదేశాలిచ్చారు. అయితే ఇప్పటికిప్పుడు అంటే కుదరదని రైతులు చెప్పారు. అయినా తమ సొంత పొలంలో వడ్లు ఆరబోసుకున్నామని, హెలిప్యాడ్ కోసం తమ వడ్లు ఎందుకు తీయాలి అంటూ అధికారులను రైతులు నిలదీశారు. కావాలనే అధికారులు వేధిస్తున్నారని రైతులు మండిపడ్డారు.