హైడ్రా కమిషనర్ రంగనాథ్ జీహెచ్ఎంసీ పరిధిలోని వరద ముప్పు ప్రాంతాల్లో పర్యటించారు. మంగళవారం కురిసిన వర్షానికి మునిగిన రామచంద్రాపురం ప్రాంతంలో ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. పూడుకుపోయిన కాలువలను తెరిపించడంతో పాటు బైపాస్గా వరద కాలువ తవ్వకాలను హైడ్రా కమిషనర్ పరిశీలించారు. వర్షాకాలం మళ్లీ రోడ్డుపై నీరు నిలవకుండా..వరద కాలువల ద్వారా వెళ్లేలా విస్తరించాలని అధికారులను ఆదేశించారు.
రామచంద్రాపురంలో వరద నీరు నిలిచి ఇబ్బందులు ఏర్పడటానికి గల కారణాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ జీహెచ్ఎంసీ, నేషనల్ హైవే అధికారులను అడిగి తెలుసుకున్నారు. సురభి కాలనీ ప్రారంభంలో ఉన్న ఆర్యూబీ వద్ద నీరు నిలిచే ప్రాంతాలను కూడా హైడ్రా కమిషనర్ పరిశీలించారు. గోపి చెరువు, చాకలి చెరువుల నుంచి వచ్చే వరదతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వరదలతో ఇబ్బంది ఏర్పడుతోందని రంగనాథ్తో జీహెచ్ఎంసీ అధికారులు చెప్పారు. కాగా డ్రైన్లలో చెత్త పేరుకుపోకుండా చూడాలని అధికారులను హైడ్రా కమిషనర్ ఆదేశించారు.